జనగామ: జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు గురువారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. దేవాలయాలు భక్తులతో కళకళలాడగా, వేద మంత్రాలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో మార్మోగాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ సీతారామచంద్ర, లక్ష్మణ, ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుతో మండపాలకు తీసుకొచ్చారు. అనంతరం విఘ్నేశ్వర పూజ, స్వస్తివాచనం, అఖండ దీపారాధన, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ట, ధ్వజారణ కార్యక్రమాలు ఘనంగా నిర్వ హించారు.
వాడవాడలా
పట్టణంలోని 27వ వార్డు పాత బీటుబజారు శ్రీరామనవమి పందిరి వద్ద గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ ఉత్సవాలు ఈసారి మరింత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, డీసీపీ రాజమహేంద్రనాయక్ పాల్గొని భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. హెడ్పోస్టాఫీసు ఆవరణలోని శ్రీ సంతోషీమాత ఆలయంలో ప్రధాన పూజారి శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో కౌన్సిలర్ చెంచారపు కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు.
వసంత నవరాత్రోత్సవాలు షురూ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం చైత్రమాసం పాడ్యమి తిథిని పురస్కరించుకుని గురువారం వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి నిర్మాల్య సేవ, నిత్యాహ్నికం నిర్వహించారు.


