కుష్ఠుపై అవగాహన
జనగామ రూరల్: ఈనెల 30నుంచి ఫిబ్రవరి 13 వరకు కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కె.మల్లికార్జునరావు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని అర్బన్ పీహెచ్సీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. కుష్ఠు పూర్తిగా నయం అయ్యే వ్యాధి అన్నారు. తొలిదశలో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. వంశపారంపర్యం కాదని, చికిత్స ప్రారంభించిన తర్వాత ఇది ఇతరులకు సోకదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు, చికిత్స ఉచితంగా అందుబాటులో ఉందని వివరించారు. స్పర్శ జ్ఞానం తగ్గి తెల్లటి, ఎర్రటి మచ్చలు, చేతులు, కాళ్లలో పట్టు లేకపోవడం లక్షణాలుగా చెప్పారు. నరాలు మందగించడం, చికిత్స చేయకపోతే కండరాల బలహీనత, వికారాలు ఉన్న వ్యక్తులు కుష్టు వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్లు కమల్ హాసన్, అనురాధ జాధవ్, రేవతి ప్రతిజ్ఞ చేశారు.


