ప్రతీ కుటుంబానికి ఆడపిల్ల ఒక వరం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: ప్రతీ కుటుంబానికి ఆడపిల్ల ఒక వరమని, బాలికల హక్కులను పరిరక్షించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల పట్ల వివక్షతను ప్రదర్శించకుండా వారి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. శ్రీబేటీ బచావో–డిజిటల్ హటావోశ్రీ అనే సందేశంతో బాలికలను డిజిటల్ దుర్వినియోగం నుంచి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీ కోదండరాములు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, జీసీడీఓ గౌసియా బేగం, సీడబ్ల్యూసీ చైర్మన్ ఉప్పలయ్య, శ్రీలత, కవిత తదితరులు పాల్గొన్నారు.
రేపు సాంస్కృతిక కార్యక్రమాలు
జనగామ: రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు (సోమవారం) జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో ప్రముఖ గాయకుడు రాంమిర్యాల ఆధ్వర్యంలో ఆటాపాట, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 26న సాయంత్రం 6 గంటలకు జరిగే వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
రిపబ్లిక్ డేకు పకడ్బందీ ఏర్పాట్లు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం వేడుకలు జరిగే ధర్మ కంచ స్టేడియాన్ని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారం స్టేజీ ఏర్పాట్లు, తాగునీటి వసతి, అంబులెన్స్, ఫైర్ తదితర అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏసీపీ పండరి చేతన్, ఆర్డీఓ గోపిరాం, డీఆర్డీఓ వసంత, అధికారులు పాల్గొన్నారు. అలాగే ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ నమోదు లక్ష్యాన్ని సాధించే విధంగా అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. క్యాంపు కార్యాలయం నుంచి ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంఈఓలతో జూమ్ సమావేశం నిర్వహించారు.


