పత్తి కొనుగోళ్లలో సీసీఐ జిమ్మిక్కులు | - | Sakshi
Sakshi News home page

పత్తి కొనుగోళ్లలో సీసీఐ జిమ్మిక్కులు

Nov 4 2025 7:18 AM | Updated on Nov 4 2025 7:18 AM

పత్తి కొనుగోళ్లలో సీసీఐ జిమ్మిక్కులు

పత్తి కొనుగోళ్లలో సీసీఐ జిమ్మిక్కులు

వరంగల్‌: కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో లబ్ధి పొందుదామని భావిస్తున్న పత్తి రైతులకు ఆశాభంగమే ఎదురుకానుంది. సీసీఐ గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసిన పత్తిలో సగానికి పైగా వరంగల్‌ జిల్లా నుంచి రావడంపై అందరి దృష్టి పడింది. తెలంగాణ జిల్లాల్లోని రైతులు తమకు ఇష్టం వచ్చిన సీసీఐ(జిన్నింగ్‌ మిల్లులు, సీసీఐ కొనుగోలు కేందాలు)లలో విక్రయించారు. ఈవిక్రయాల కోసం వ్యవసాయ అధికారులు టెంపరరీ రిజిస్ట్రేషన్‌(టీఆర్‌)లను జారీ చేయడం, రైతులు చెప్పిన ఫోన్‌ నంబర్లకు ఓటీపీ వచ్చే విధంగా మార్కెట్‌ అధికారులు సహకారం అందించడంతో ఇందులో పెద్దగా అక్రమాలు జరిగినట్లు ఉన్నతాధికారులు భావించారు. దీంతో ఈ ఏడాది సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలంటే కొత్తగా అమలులోని తీసుకువచ్చిన ‘కపాస్‌ కిసాన్‌’యాప్‌లో రైతులు తమ వివరాలు నమోదు చేసుకుని స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. లేకుంటే సంబంధిత కొనుగోలు కేంద్రంలో పత్తిని అమ్ముకునే వీలుండదు. ఈవిధానంపై 80శాతం మందికి అవగాహన లేదు. యాప్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న ఈ నంబర్‌ ఆధార్‌కు లింక్‌ కాకుంటే స్లాట్‌ బుక్‌ కాదు. స్లాట్‌ బుక్‌ కాకుంటే రైతు పత్తి ఆమ్మకునే వీలుండదు. ఈవ్యవహారం చూసిన రైతులు తమ పత్తిని నేరుగా మార్కెట్‌లకు తీసుకువచ్చి ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. దీనివల్ల రైతులు తేమశాతం నిర్దేశించిన మేరకు ఉన్నా ప్రతి క్వింటాల్‌కు రూ.వేయి నుంచి 1500లవరకు నష్టపోతున్నారు. ౖప్రజాప్రతినిధులు గతేడాది మాదిరిగా పత్తిని విక్రయించుకునేందుకు సీసీఐ అధికారులను ఒప్పించడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రోజుకో నిబంధన...

సీసీఐ రోజుకో నిబంధన తీసుకురావడం వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈఏడాది 5,23,848 ఎకరాలు పత్తి వేసినట్లు వ్యవసాయ అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. కాగా, ఇటీవల మోంథా తుపాను వరదలతో పత్తికి భారీగా నష్టం వాటిల్లింది. వరంగల్‌ జిల్లాలో 55,000, హనుమకొండలో 620, మహబూబాబాద్‌ 8,782, జనగామలో 6,445 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంకా సర్వే కొనసాగుతోంది. అకాల వర్షాల వల్ల ఎకరాకు దిగుబడి తగ్గితే 8క్వింటాళ్లుగా వస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై జిల్లాల్లో మరోసారి అంచనాలు వేసి ఎకరాకు 11.74క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా 12క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్‌ ఇచ్చింది. ఇప్పుడు 7క్వింటాళ్లు అని సీసీఐ ప్రకటించడంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. దీంతోపాటు అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని 20శాతం తేమ ఉన్నా సీసీఐ కొనుగోలు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని, లేనిపక్షంలో ఈనెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్లు నిలిపివేస్తామని తెలంగాణ జిన్నింగ్‌ మిల్లర్స్‌, ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం, సీసీఐతో చర్చించి సమస్యను పరిష్కరించకుంటే పత్తి రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.

60 కేంద్రాలకు నోటిఫై..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈఏడాది సాగు చేసిన పత్తి విస్తీర్ణంలో 41లక్షల 90వేల 780క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈలెక్క ప్రకారం సీసీఐ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60సీసీఐ కొనుగోలు కేంద్రాలను జిన్నింగ్‌ మిల్లుల్లో ఏర్పాటు చేసేందుకు నోటిఫై చేశారు. ఈసారి రైతులు ఇష్టం ఉన్న మిల్లుల్లో అమ్ముకోకుండా ఎల్‌ 1. ఎల్‌ 2, ఎల్‌ 3 కేటగిరీలను అమలులోకి తీసుకువచ్చారు. ఎల్‌1లో నిర్దేశించిన మేరకు పత్తిని కొనుగోలు చేస్తే ఎల్‌ 2లో ఉన్న కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు అనుమతిస్తారు. ఈవిధానం వల్ల రైతులు అనుకూలంగా ఉన్న మిల్లుల్లో అమ్ముకోని పరిస్థితులు నెలకొన్నా యి. దీంతో రైతులు సీసీఐ కేంద్రాల కంటే ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈపద్ధతిని తొలగించి పాత పద్ధతిలో పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని జిన్నింగ్‌మిల్లుల యజమానులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

రోజుకో నిబంధనలతో ఠారెత్తుతున్న మిల్లుల యజమానులు

కొత్తగా వచ్చిన యాప్‌తో రైతుల

ఇబ్బందులు

దిగుబడి అంచనాల తగ్గింపుతో

కర్షకులకు నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement