
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్రీల్
జనగామ: ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, బోధనా నాణ్యత, విద్యార్థులు నేర్చుకునే స్థాయిని అంచనా వేసేందుకు టీచర్లతో కూడిన కొత్త ప్యానెల్ తనిఖీ బృందాల ఏర్పాటుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు పంపించారు. బోధనా నాణ్య త, రికార్డులు, విద్యార్థుల ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. దీంతో సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాల అంచనా, బాధ్యతాయుత బోధనతో విద్య మరింత బలపడే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కానీ దీనిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
తనిఖీలు ఎలా..
జిల్లాలో ప్రతీ మూడు నెలలకోసారి 150 పాఠశాలలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇందులో 100 ప్రాథమిక, ప్రాథమికోన్నత, 50 ఉన్నత పాఠశాలలను తనిఖీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనిఖీల్లో బోధన, విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాలు, విద్యా ఫలితాలు, శుభ్రత, పాఠశాల రికార్డులు, పాఠ్య ప్రణాళిక అమలు, డిజిటల్ క్లాస్ తరగతుల వినియోగం వంటి అంశాలు సమగ్రంగా పరిశీలించాలి. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో టీచర్లతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయాలి.
ప్రాథమిక పాఠశాలల్లో..
జిల్లాలో 343(పీఎస్), 64(ప్రాథమికోన్నత), 103 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమా రు 29, 500 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాలల పరిధిలో ప్రధానోపాధ్యాయుడు(నోడల్ అధికారి), ఇద్దరు ఎస్జీటీలు సభ్యులుగా ఉంటారు. ప్రాథమికోన్నత బడుల్లో స్కూల్ అసిస్టెంట్(నోడల్ అధికారి), ప్రధానోపాధ్యాయుడు, ఒక ఎస్జీటీ సభ్యులుగా ఉంటారు. ఉన్నత పాఠశాలల్లో గెజిటెడ్ హెడ్మాస్టర్(నోడల్ అధికారి), ఏడుగురు సబ్జెక్టు టీచర్లు, ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సభ్యులుగా పర్యవేక్షణ చేయను న్నారు.
తనిఖీ అధికారుల పర్యవేక్షణ కోసం షరతులు..
తనిఖీ బృందాల్లో పనిచేసే టీచర్ల అర్హతలపై కఠిన నియమావళి విధించారు. జిల్లా స్థాయిలో ఎంపికయ్యే తనిఖీ అధికారులకు ఈ షరతులు తప్పనిసరి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కనీసం 10 ఏళ్ల బోధన అనుభవం కలిగి ఉండడంతో పాటు డిజిటల్ అక్షరాస్యత, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పక ఉండాలి. సదరు టీచర్లపై విధి నిర్వహణలో క్రమశిక్షణా చర్యలు లేని ఉత్తమ వ్యక్తిగా ఉండాలి. బోధనా నాణ్యతపై ఆసక్తి, మానవతా దృక్పథం కలిగి ఉండి, ఆయా శిక్షణా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఉండాలి. పాఠశాల తనిఖీ బృందాల ఎంపికను కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నేతృత్వంలో చేపడతారు. తనిఖీ బృందాలకు ఎంపికై న ఉపాధ్యాయులు పూర్తి సమయం పనిచేయాల్సి ఉంటుంది. కమిటీల ఏర్పాటుతో పాఠశాలల్లో బోధన తరగతులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి.
విద్యా నాణ్యత పెంపునకు పాఠశాల విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు
తనిఖీ అధికారులుగా ఉపాధ్యాయులకే బాధ్యతలు
అదనపు పనిభారం మోపడం సరికాదంటున్న ఉపాధ్యాయులు
బోధనా సమయం తగ్గి విద్యార్థులకు నష్టమని అభ్యంతరం

బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025