● వేధింపులు భరించలేక కొడుకును హత్య చేసిన తండ్రి ● జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెరకాలనీలో విషాదం
జగిత్యాలక్రైం: కని.. పెంచిన తల్లిదండ్రులను పెళ్లీడుకొచ్చిన కొడుకు నిత్యం వేధింపులకు గురిచేయడంతో భరించలేక కన్న తండ్రే తన కొడుకును కడతేర్చిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెరకాలనీలో చోటుచేసుకుంది. ఒడ్డెరకాలనీకి చెందిన సూర రాజయ్య, చిలుకమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సూర వెంకటేశ్ (22) చదువు మానేసి జులాయిగా తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఇటీవల అతిగా మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వాలని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం కూడా తండ్రిని వేధించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజయ్య గొడ్డలితో కొడుకు తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ను అంబులెన్స్లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రూరల్ సీఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వేధింపులు భరించలేకే కొడుకును తండ్రి హత్య చేయడంతో ఒడ్డెరకాలనీలో విషాదం చోటుచేసుకుంది.


