జగిత్యాల: జనగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జనగణన తొలిదశకు సంబంధించి సిబ్బందికి కలెక్టరేట్లో బుధవారం శిక్షణ ఇచ్చారు. ఎవరైనా వివరాలు ఇవ్వడానికి నిరాకరించినా.. తప్పుడు సమాచారం అందించినా చట్టప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందన్నారు. తొలిదశలో ఇళ్లు, సదుపాయాల స్థితిగతులు, కుటుంబాల వివరాలు పక్కాగా సేకరించాలన్నారు. డిజిటల్ పరికరాల వినియోగం, డేటా సేకరణ విధానం, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మే 11 నుంచి జనగణన ప్రారంభమయ్యే అవకాశం ఉందని, విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అదనపు కలెక్టర్ లత, ఏవో హకీం పాల్గొన్నారు.
ఈవీఎం గోదాంల వద్ద భద్రత ఉండాలి
ఈవీఎం గోదాంల వద్ద భద్రత ఉండాలని కలెక్టర్ అన్నారు. ఈవీఎం గోదాములను తనిఖీ చేశారు. యంత్రాల భద్రత, సీసీకెమెరాల పనితీరు పరిశీలించారు. ఆర్డీవో మధుసూదన్, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు.
గర్భిణులు సమయానికి పరీక్షలు చేయించుకోవాలి
గర్భిణులు సమయానికి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భిణులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వసతులు ఉంటాయని, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. డీఎంహెచ్వో సుజాత, డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
జగిత్యాలరూరల్: జిల్లాలో చేపడుతున్న అభివవృద్ధి పనులు నాణ్యతతో వేగంగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. బీర్పూర్ మండలం నర్సింహులపల్లిలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. కార్మికుల హాజరు నమోదు విధానం, ఎన్ఎంఎంఎస్ యాప్ పరిశీలన, జియోట్యాగింగ్తో ఫొటో క్యాప్చరింగ్ ప్రక్రియ పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. డీఆర్డీఏ పీడీ రఘువరన్, హౌసింగ్ పీడీ ప్రసాద్, పీఆర్ ఈఈ లక్ష్మణ్రావు, తహసీల్దార్, ఎంపీడీవో పాల్గొన్నారు.


