ఇరాన్ నిన్న ( శుక్రవారం) అమెరికా ఫైటర్ జెట్ను కూల్చివేయడంతో దాని ఫైలట్ ఇరాన్ భూభాగంలో దూకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఫైలట్ తల్లి ఎక్స్ వేదికగా తన గోడు వెల్లగక్కింది. దీనిపై పాకిస్థాన్లోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది.
నిన్న (శుక్రవారం) జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇరాన్ రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసింది. ఈ ఘటనలో ఇద్దరు ఫైలట్లు ఇరాన్ భూభాగంలో దూకారు. వీరిలో ఒక పైలట్ ఆచూకీ లభించగా, మరో పైలట్ గల్లంతయ్యారు. అయితే తన కుమారుడు కూడా ఫైటర్ పైలట్ అని, అతని గురించి ఎటువంటి సమాచారం తెలియడం లేదని ఆందోళన చెందుతూ ఒక అమెరికన్ మహిళ X (ట్విట్టర్) లో పోస్ట్ చేసింది. "నా కుమారుడి కోసం, ఇతర పైలట్ల కోసం ప్రార్థించండి" అని ఆవేదన వెల్లగక్కింది.
దీనిపై పాక్, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. పాక్లోని కార్యాలయం "డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఉండటం కంటే, ఇరాన్ కస్టడీలో ఉండటమే మీ కుమారునికి సురక్షితం. అమెరికా రెస్క్యూ టీమ్స్ కంటే ఇరాన్ అతన్ని బందీగా పట్టుకోవాలని ప్రార్థించండి. ముస్లింలుగా, నాగరికత కలిగిన ఇరానియన్లుగా మేము యుద్ధ ఖైదీలను గౌరవంగా చూస్తాము," అని పేర్కొంది.
దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ: "అమెరికా లేదా వారి మిత్రదేశాల వలె మేము అనాగరికంగా ప్రవర్తించము. మాకు గొప్ప నాగరికత ఉంది, యుద్ధ ఖైదీల హక్కుల గురించి మాకు బాగా తెలుసు," అని విమర్శించింది. అయితే యుద్ధం మెుదలై నెలరోజులు దాటినా ఇంకా పరిస్థితులు ఉదృతంగానే కొనసాగుతున్నాయి.


