ఇరాన్కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. యుద్ధ ఉద్రిక్తతలను ముగించేందుకు ఇరాన్ వెంటనే ఒప్పందానికి రావాలన్నారు. లేనిపక్షంలో ఆ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు తీవ్రతరం చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
పశ్చిమాసియా యుద్ధం మెుదలై నెలరోజులు గడుస్తున్నా పరిస్థితులు ఇంకా సద్దుమణగడం లేదు కదా మరింత తీవ్రతరమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్తో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు త్వరగా ఒక డీల్ కుదుర్చుకోవాలని మధ్యవర్తుల ద్వారా వాన్స్ సందేశం పంపారు.
ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనంగా ఉన్నారని డీల్ కుదరకపోతే పరిస్థితులు చేయిదాటిపోతాయని హెచ్చరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలు ,విద్యుత్ కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లు తదితర వాటిపై దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కాగా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా చేసిన ప్రకటనలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది "యుద్ధ నేరాల" కిందకు వస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. కాగా అమెరికా హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పందిస్తూ తాము దౌత్యానికి సిద్ధమే కానీ, అమెరికాను అస్సలు నమ్మడం లేదని పేర్కొన్నారు.
అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ నుండి నేరుగా సందేశాలు అందుతున్న మాట నిజమేనని, అయితే వీటిని అధికారిక చర్చలుగా భావించలేమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా భూతల దాడులకు పాల్పడే ధైర్యం చేయదని, ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సర్వసన్నద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు.


