నీరజ్‌ అనంతాని అరుదైన రికార్డు | US Presidential Election 2020 Niraj Antani Won In Ohio Senate | Sakshi
Sakshi News home page

నీరజ్‌ అనంతాని అరుదైన రికార్డు

Nov 5 2020 8:12 AM | Updated on Nov 5 2020 8:12 AM

US Presidential Election 2020 Niraj Antani Won In Ohio Senate - Sakshi

వాషింగ్టన్‌: సెనేట్‌లోనూ హోరాహోరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన నీరజ్‌ అనంతాని (29) అరుదైన రికార్డు సృష్టించారు. ఒహాయో రాష్ట్రం నుంచి సెనేట్‌కు ఎన్నికైన తొలి భారతీయ సంతతి అభ్యర్థిగా రికార్డుల్లోకి ఎక్కారు. స్టేట్‌ రిప్రజెంటేటివ్‌గా వ్యవహరిస్తున్న నీరజ్‌ రిపబ్లికన్‌ పార్టీ తరఫున సెనేట్‌కు పోటీ చేశారు. డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి మార్క్‌ ఫోగెల్‌పై విజయం సాధించారు. విజేతగా నిలిచిన తరువాత నీరజ్‌ మాట్లాడుతూ కేవలం 70 ఏళ్ల క్రితం మాత్రమే స్వాతంత్య్రం సాధించిన భారత్‌లో తన పూర్వీకులు బ్రిటిష్‌ ఏలుబడిలో జీవించారని, అటువంటి కుటుంబానికి చెందిన తాను సెనేటర్‌గా ఎన్నిక కావడం అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనమని వ్యాఖ్యానించారు. భారతీయ సంతతి సమూహం తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ( సెనేట్‌లోనూ హోరాహోరీ )

సెనేటర్‌గా గెలిపించిన ఓటర్లందరికి ధన్యవాదాలు తెలిపిన నీరజ్‌ వారి తరఫున స్టేట్‌హౌస్‌లో గళం వినిపిస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ శాస్త్రం పట్టభద్రుడైన నీరజ్‌ 2014లో 23 ఏళ్ల వయసులోనే ఓహాయో స్టేట్‌ హౌస్‌కు ఎన్నికైఆ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగానూ రికార్డు సృష్టించారు. ‘‘స్టేట్‌ సెనేటర్‌గా ఓహాయో వాసులందరూ తమ అమెరికన్‌ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు నిత్యం శ్రమిస్తా’’అని నీరజ్‌ హామీ ఇచ్చారు. నీరజ్‌ తల్లిదండ్రులు 1987లో వాషింగ్టన్‌కు వలస వచ్చారు. ఆ తరువాత మయామీకి తమ నివాసాన్ని మార్చారు.

Advertisement
 
Advertisement
Advertisement