రాజకీయ ప్రత్యర్థులకు ఉరిశిక్ష ... వద్దని హెచ్చరించిన యూఎన్‌

Un Official Says Myanmar Juntas Plans Execute Political Opponents - Sakshi

Myanmar Junta Executions' Plan: మయన్మార్‌ జుంటా ప్రభుత్వం ఆంగ్‌ సాన్‌ సూకీ పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యుడు, ఒక ప్రజాస్వామ్య కార్యకర్తని ఉరితీస్తామని ప్రకటించింది. ఇద్దరూ తీవ్రవాదానికి పాల్పడ్డారని, అందువలన మరణశిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. అదీగాక 1991 తర్వాత దేశంలో తొలిసారిగా న్యాయపరమైన ఉరిశిక్ష విధించిబడుతుందని పేర్కొంది. ఈ మేరకు మాజీ ఎంపీ ఫియో జెయా థా, ప్రజాస్వామ్య కార్యకర్త కో జిమ్మీతో సహా నలుగురికి మరణశిక్ష విధించినట్లు జుంటా ప్రతినిధి జా మిన్ తున్  తెలిపారు. పైగా వారిని జైలు విధానాల ప్రకారం ఉరితీస్తామని వెల్లడించారు.

ఐతే ఈ కేసును మయన్మార్‌ తరుపున యూఎన్‌ విచారణా యంత్రాంగానికి అధిపతి అయిన నికోలస్‌ కౌమ్జియాన్‌ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం, విచారణలో దోషులుగా నిర్ధారించబడిన వ్యక్తుల ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయని తెలుస్తోందన్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఉరితీయడం అనేది యుద్ధ నేరం లేదా మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలతో సమానం అని ఆయన హెచ్చరించారు.

గతేడాది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మయన్మార్‌ జుంటా ప్రభుత్వం అణిచివేతలో భాగంగా డజన్ల కొద్దీ తిరుగుబాటు వ్యతిరేక కార్యకర్తలకు మరణశిక్ష విధించింది. అయితే మయన్మార్ దశాబ్దాలుగా ఉరిని అమలు చేయలేదు. విచారణ న్యాయమైనదిగా పరిగణించబడాలంటే, సాధ్యమైనంత వరకు ఈ కేసుని బహిరంగంగా దర్యాప్తు చేయాలని యూఎన్‌ విచారణాధికారి కౌమ్జియాన్ అన్నారు.

కానీ ఈ కేసులో పబ్లిక్‌ ప్రోసీడింగ్‌లు లేదా తీర్పులు బహిరంగంగా అందుబాటులో లేవు. ఇక్కడ ట్రిబ్యునల్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించిందా లేదా అనే సందేహాన్ని రేకెత్తించిందన్నారు. మయన్మార్‌ కోసమే ఈ యూఎన్‌ విచారణా యంత్రాంగం 2018లో యూఎన్‌ మానవ హక్కుల మండలిచే రూపొందించబడింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం, క్రిమినల్ ప్రొసీడింగ్‌లను సులభతరం చేసేలా డాక్యుమెంట్ చేయడం దీని పని.

(చదవండి: ఉక్రెయిన్‌ చిన్నారుల కోసం.. నోబెల్‌ బహుమతిని వేలానికి పెట్టిన రష్యాన్‌ జర్నలిస్ట్)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top