వాషింగ్టన్: పోలాండ్కు అదనంగా 5 వేల బలగాలను పంపించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యూరప్లో తమ బలగాలను తగ్గిస్తామంటూ ట్రంప్, ఆయన యంత్రాంగం ఇటీవల తరచూ ప్రకటనలు చేస్తుండటం తెల్సిందే. ఇందుకు విరుద్ధంగా పోలాండ్కు అదనంగా బలగాలను తరలిస్తామంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ట్రూత్ సోషల్ వేదికగా తెలిపారు.
ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో తాను మద్దతు ప్రకటించిన కరోల్ నవ్రోకీ విజయం సాధించడంతో, ఆయనతో తనకున్న సత్సంబంధాల నేపథ్యంలో అదనంగా 5 వేల సైనికులను అక్కడికి తరలించాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్తో యుద్ధంలో నాటో దేశాలు తనతో సహకరించకపోగా, జర్మనీ చాన్సలర్ మెర్జ్ చేసిన వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న ట్రంప్ జర్మనీ నుంచి 5 వేల మంది సైనికులను ఉపసంహరించుకున్నట్లు ఇప్పటికే ప్రకటించడం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనతో నాటో దేశాల నేతలు అయోమయానికి గురవుతున్నారు.


