పశ్చిమాసియాలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ట్రంప్ అదనపు బలగాల్ని యుద్ధ క్షేత్రంలోకి తరలిస్తుంటే.. ఇరాన్ సైతం నరకానికి స్వాగతం అని సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో వైట్హౌస్ కీలక ప్రకటన చేసింది. యుద్ధం ముగింపుకు చర్చలు సజావుగా సాగుతున్నాయని వెల్లడించింది.
ఇరాన్లో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మట్లాడారు." ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయి. చర్చల్లో పురోగతి కనిపిస్తోంది. ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగా చేసే ప్రకటనలకు, తెరవెనుక అమెరికా అధికారులతో జరుపుతున్న చర్చలకు చాలా తేడా ఉంది అని ఆమె పేర్కొంది.
అదేవిధంగా ప్రస్తుతం సోషల్ మీడియాలతో పాటు కొన్నిమీడియా సంస్థల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలు అని ఆమె కొట్టిపడేశారు. ఇరాన్ పాలకుల బహిరంగ హెచ్చరికలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చర్చలు మాత్రం సజావుగానే జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు.
అయితే కరోలిన్ ప్రకటనకు వాస్తవ పరిస్థిలకు చాలా భిన్నంగా ఉంది. ఇరాన్ మాత్రం చర్చలు జరగట్లేదని గట్టిగా చెబుతోంది. ట్రంప్ సైతం వేల సంఖ్యలో అదనపు బలగాల్ని ఇది వరకే మధ్యప్రాచ్యానికి తరలించారు. హార్మూజ్ తెరవకపోతే దాడులు తీవ్రస్థాయిలో ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.


