ఈద్ అల్-ఫితర్ రోజు సూడాన్లోని ఓ ఆసుపత్రిపై (ఈస్ట్ దార్ఫూర్లోని ఎడ్ దాయిన్) సైన్యం జరిపిన డ్రోన్ దాడిలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 89 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది పిల్లలు, ఏడుగురు మహిళలు (ముగ్గురు గర్భిణులు), 44 మంది పురుషులు ఉన్నారు.
ఈ దాడిలో ఆసుపత్రి శస్త్రచికిత్స విభాగం పూర్తిగా నేలమట్టమైంది. అత్యవసర చికిత్స భవనం తీవ్రంగా దెబ్బతింది. ప్రసూతి ఆపరేషన్ థియేటర్ పైకప్పు ధ్వంసం కాగా.. ఆసుపత్రి తలుపులు, కిటికీలు పగిలిపోయాయి. దాడి తర్వాత ఆసుపత్రి మూసివేయడటంతో లక్షలాది మంది అత్యవసర వైద్య సేవలకు దూరమయ్యారు. ఇటీవలికాలంలో ఎడ్ దాయిన్ ఆసుపత్రిపై జరిగిన మూడో వైమానిక దాడి ఇది.
కాగా, సూడాన్లో 2023 నుండి కొనసాగుతున్న అంతర్యుద్ధం 2026 నాటికి మరింత తీవ్రమైంది. సూడాన్ సైన్యం (SAF), రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరుగుతున్న ఈ ఘర్షణల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఆఫ్రికా ఖండంలోనే అత్యంత పెద్ద మానవ సంక్షోభాల్లో ఒకటిగా మారింది.


