కొద్దిరోజుల క్రితం ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాని రాజ్యసభ ఉపనాయకుడి పదవి నుంచి తొలగిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా పార్టీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీనిపై ఆప్ పార్టీ తొలిసారిగా స్పందించింది. పంజాబ్ రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో ఆయన విఫలమయ్యారని ఆ రాష్ట్ర ఆప్ అధ్యక్షుడు అమన్ అరోరా అసహానం వ్యక్తం చేశారు.
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా గత కొంతకాలంగా చాలా ఫేమస్ అయ్యారు. సామాన్యుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. సెల్ఫోన్ రీచార్జ్లో ప్రైవేటు టెలికం కంపెనీల దోపిడీపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మహా నగరాల్లో ట్రాఫిక్ సమస్య, మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో సామాన్యులను బ్యాంకులు ఇబ్బందులపై రాజ్యసభలో ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ విధంగా దూసుకపోతున్న రాఘవ్ చద్దాకు ఒక్కసారిగా ఆప్ షాకిచ్చింది. రాజ్యసభలో ఉప నాయకుడి పదవి నుంచి ఆయనను తొలగించింది. ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ను నియమించింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఆయన తొలగింపుపై తొలిసారిగా పంజాబ్ ఆప్ పార్టీ స్పందించింది.
ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర ఆర్థికమంత్రి హర్పాల్ సింగ్, ఆ రాష్ట్ర ఆప్ అధ్యక్షుడు అమన్ అరోరా సంయుక్తంగా ప్రెస్మీట్ నిర్వహించారు. రాఘవ్ చద్దా పంజాబ్ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తడంలో విఫలమయ్యారని, మండిపడ్డారు. ఆయన తీరు పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
పంజాబ్కు రావాల్సిన దాదాపు రూ. 8,500 కోట్ల గ్రామీణాభివృద్ధి నిధులు అలాగే రూ.60,000 కోట్ల జీఎస్టీ నష్టపరిహారం వంటి కీలక ఆర్థిక అంశాలను ఆయన ప్రస్తావించలేదని ఆర్థిక శాఖ మంత్రి చీమా మండిపడ్డారు. గతేడాది పంజాబ్లో వచ్చిన వరదల దృష్ట్యా ప్రధాని మోదీ ప్రకటించిన రూ.1,600 కోట్ల ఆర్థిక సహాయం పూర్తిగా అందలేదని, ఈ విషయాన్ని కూడా ఆయన సభ దృష్టికి తీసుకురాలేదని ఆరోపించారు.


