రావల్కోట్: మరోసారి పాకిస్థాన్ ఆర్మీ బరితెగించింది. పీవోకే రావల్కోట్లో నిరసనకారులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 16 మంది మృతి చెందారు. మరో 37 మంది గాయపడ్డారు. రెండు రోజుల కిందట పీఓకేలో ఘర్షణలు చెలరేగగా.. రెండు రోజుల క్రితం కాల్పుల్లో 30 మందికిపైగా మృతిచెందారు. పాక్ నుంచి విముక్తి కల్పించాలంటూ నిరసనకారులు ఆందోళనలు చేపడుతుండగా.. వారిపై పాక్ ఆర్మీ కాల్పులతో విరుచుకుపడుతోంది. గత మూడు రోజులుగా పీవోకే ఘర్షణ వాతావరణం నెలకొంది.
సాధారణ పౌరులు తమకు అందుబాటు ధరల్లో పిండి, బియ్యం, విద్యుత్తో పాటు ప్రాథమిక హక్కులను కల్పించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ప్రారంభించిన ఈ నిరసన ర్యాలీపై పాకిస్తాన్ సైన్యం ఒక్కసారిగా కాల్పులు జరపడంతో హింసాత్మకంగా మారింది. పాకిస్థాన్ విధానాలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు నినాదాలు చేస్తూ.. ర్యాలీ నిర్వహించారు. రెండు రోజుల క్రితం (మంగళవారం) పీవోకేలో నిరసనకారులపై పాక్ సైన్యం కాల్పులు జరపగా.. మరణించిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కూడా ఈ నిరసనకారులు డిమాండ్ చేశారు.
కాగా, పీవోకేలో ఇటీవల ముజఫరాబాద్, రావల్కోట్, మీర్పూర్ ప్రాంతాల్లో నిరసనలు ఉధృతమయ్యాయి. పెరుగుతున్న జీవన వ్యయం, నిరుద్యోగం, విద్యుత్ బిల్లుల భారం, పాలనాపరమైన సమస్యలపై ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కొన్ని చోట్ల నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, కాల్పులు జరిగినట్లు కూడా నివేదికలు వెల్లడించాయి.


