భారత్‌తో కాళ్ల బేరానికి పాకిస్తాన్‌.. పాక్‌ ఉప ప్రధాని కీలక ప్రకటన! | Pak foreign minister Ishaq Dar Key Comments India War | Sakshi
Sakshi News home page

భారత్‌తో కాళ్ల బేరానికి పాకిస్తాన్‌.. పాక్‌ ఉప ప్రధాని కీలక ప్రకటన!

May 10 2025 1:31 PM | Updated on May 10 2025 3:10 PM

Pak foreign minister Ishaq Dar Key Comments India War

ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్తాన్‌ యుద్ధం వేళ దాయాదికి చుక్కలు కనిపిస్తున్నాయి. భారత్‌ దాడుల కారణంగా పాకిస్తాన్‌కు తీవ్ర నష్ట​ం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ డిప్యూటీ పీఎం, విదేశాంగమంత్రి ఇషాక్ దార్ కీలక ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

పాకిస్తాన్‌పై భారత్‌ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని పాక్‌ మంత్రి ఇషాక్ దార్ ప్రకటన చేశారు. భారత్‌ ఆగిపోతే, మేం కూడా అలాగే చేస్తామని ఇషాక్ దార్ తెలిపారు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, భారతదేశం ఈ సమయంలో ఆగిపోతే మేము కూడా శాంతిని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ప్రతీకారం తీర్చుకోమని, ఏమీ చేయమని కూడా చెప్పుకొచ్చారు. తాము నిజంగా శాంతిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్దితుల నేపథ్యంలో పాకిస్తాన్ ఉద్రిక్తతను తగ్గించాలని కోరుకుంటుందని , భారత్‌తో చర్చల కోసం కొత్త కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాలు సీఎన్ఎన్ న్యూస్‌కు వెల్లడించాయి.

అయితే, పాక్‌ మంత్రి ప్రకటనకు ముందు.. పాకిస్తాన్‌కు అమెరికా కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత తీవ్రతరం కాకముందే భారత్‌తో తక్షణం చర్చలు జరపాలని పాకిస్తాన్‌కు అమెరికా సూచనలు చేసింది. సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాక్‌కు సూచించారని విదేశాంగశాఖ తెలిపింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు అవసరమైతే ఇరు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం చేస్తామని ప్రతిపాదించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పాక్‌ ఇలా ప్రకటన చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు.. ఇప్పటికే పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా భారత్ సరిహద్దులో తన కార్యకలాపాలను నిలిపివేస్తే తదుపరి చర్యలకు దూరంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో భారత్ దాడులు పాకిస్తాన్‌ను ఓ రేంజ్‌లో ఇబ్బందులు పెడుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్‌లో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఇస్లామాబాద్‌లో పెట్రోల్‌ బంకులను 48 గంటల పాటు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement