‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌’గా కేట్‌ మిడిల్టన్‌ | Kate Middleton as Princess of Wales | Sakshi
Sakshi News home page

‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌’గా కేట్‌ మిడిల్టన్‌

Sep 10 2022 6:10 AM | Updated on Sep 10 2022 6:10 AM

Kate Middleton as Princess of Wales - Sakshi

కేట్‌ మిడిల్టన్‌

లండన్‌: బ్రిటన్‌ నూతన రాజు చార్లెస్‌–3 తన పెద్ద కుమారుడు ప్రిన్స్‌ విలియమ్స్‌ను ‘ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌’గా, ఆయన భార్య కేట్‌ మిడిల్టన్‌ను ‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌’గా ప్రకటించారు. అంతేకాకుండా డ్యూక్‌ ఆఫ్‌ కార్న్‌వాల్‌గానూ విలియమ్స్‌ కొనసాగుతారు. ప్రిన్సెస్‌ డయానా తర్వాత ‘ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌’ హోదా పొందిన తొలివ్యక్తి కేట్‌ మిడిల్టన్‌ కావడం గమనార్హం. డయానా మరణం తర్వాత ఈ హోదా ఇన్నాళ్లూ ఖాళీగానే ఉంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)తోపాటు కామన్‌వెల్త్‌ దేశాలకు విధేయుడిగా ఉంటానని, అంకితభావంతో సేవలందిస్తానని కింగ్‌ చార్లెస్‌ అన్నారు. బ్రిటన్‌ రాజు హోదాలో ఆయన శుక్రవారం సాయంత్రం తొలిసారిగా టీవీలో జాతినుద్దేశించి ప్రసంగించారు.

తన ప్రియమైన తల్లి ఎలిజబెత్‌–2 తనపై అమితమైన ప్రేమ చూపించారని, ఆప్యాయత అందించారని, మార్గదర్శిగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. జీవితాంతంప్రజా సేవలో గడిపారని అన్నారు. ఆమె జీవితం తనకొక ఉదాహరణగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఆమె లోటును తనతోపాటు ఎంతోమంది అనుభవిస్తున్నారన్నారు. రెండో కుమారుడు హ్యారీ, అతడి భార్య మేఘన్‌కు కింగ్‌ చార్లెస్‌–3 శుభాకాంక్షలు తెలిపారు. జీవితాలను చక్కగా తీర్చిదిద్దుకుంటున్న వారిద్దరి పట్ల తన ప్రేమను వ్యక్తీకరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. హ్యారీ రాచరిక హోదా వదులుకుని భార్యతో పాటు అమెరికాలో ఉంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement