‘నేను మలాలా కాదు.. భారతదేశంలో సురక్షితంగా ఉన్నా’ | Kashmiri Activist Yana Mir Says I Am Not Malala Safe In Country, Speech In UK Goes Viral - Sakshi
Sakshi News home page

Yana Mir UK Parliament Speech: ‘నేను మలాలా కాదు.. భారత్‌లో సురక్షితంగా ఉన్నా’.. అణచివేత కథనాలకు కౌంటర్‌

Feb 23 2024 7:06 PM | Updated on Feb 23 2024 7:48 PM

Kashmiri Activist Yana Mir Says I Am Not Malala Safe In Country Speech UK Viral - Sakshi

లండన్‌: ప్రపంచవేదికపై భారతదేశ ప్రతిష్టను  దిగజార్చడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్‌ ప్రచారాన్ని కశ్మీర్‌ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ యానా మీర్‌ తీవ్రంగా ఖండించారు. బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన ‘సంకల్ప్‌ దివాస్‌’ కార్యక్రమంలో  యానా మీర్‌ ప్రసంగించారు. భారత్‌లో అంతర్భాగం అయిన కశ్మీర్‌లో తనకు​ భద్రత, స్వేచ్ఛ ఉందని తెలిపారు. ఈ విషయంలో పాకిస్తాన్‌  భారత్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు.

‘నేను మలాలా యూసఫ్‌జాయ్‌ని కాదు. ఎందుకంటే నేను నా దేశంలో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నా. భారతదేశంలో అంతర్భాంగా ఉన్న నా మాతృభూమి కశ్మీర్‌లో ఉన్నా. నేను ఎప్పుడూ అక్కడి నా దేశం నుంచి శరణార్థిలా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను   మలాలా యూసఫ్‌జాయ్‌ని అస్సలు కాను. నా దేశాన్ని, నా మాతృభూమి (కశ్మీర్‌)ను అణచివేయబడిన ప్రాంతమని వ్యాఖ్యానించిన మాటలను తీవ్రంగా తప్పుపడుతున్నా. సోషల్‌ మీడియా, ప్రపంచ మీడియాలో ఉన్న టూల్‌కిట్‌ సభ్యులు నా దేశంలోని కశ్మీర్‌ను సందర్శించకుండా అణచివేత పేరుతో వండివార్చిన తప్పుడు కథనాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా’ అని అన్నారు.

‘భారతీయులను మతం ప్రాతిపాదికన చూడటం ఆపేయండి. ఆ ప్రాతిపాదికతో మా దేశాన్ని ముక్కలు చేయటాన్ని మేము అనుమతించం. ఈ ఏడాది ‘సంకల్ప్‌ దివాస్‌’ యూకే, పాకిస్తాన్‌లో ఉన్న భారత వ్యతిరేకులు.. ప్రపంచ మీడియా, ప్రపంచ మానవ హక్కుల వేదికలపై భారత్‌పై దుష్ప్రచారాన్ని ఆపేయాలని ఆశిస్తున్నా. ఉగ్రవాదం మూలంగా వేలాది కశ్మీరీ తల్లులు తమ పిల్లలను పొగొట్టుకున్నారు. నా కశ్మీరీ సమాజం ఇక నుంచి ప్రశాంతగా జీవించాలనుకుంటుంది. కృతజ్ఞతలు..  జైహింద్‌.. ’ అని యానా మీర్‌ తెలిపారు. ఈ సందర్భంగా  జమ్మూ కశ్మీర్‌లోని ప్రజల మధ్య విభేదాలు సృష్టించే  విధంగా వార్తలను ప్రచురించవద్దని ఆమె అంతర్జాతీయ మీడియాకు విజ్ఞప్తి చేశారు.

జమ్మూ కశ్మీర్‌లో వైవిధ్యాన్ని పెంపొందించడంలో ఆమె చేసిన కృషికి ‘డైవర్సిటీ అంబాసిడర్ అవార్డు’తో ఆమెను సత్కరించారు. ప్రతికూల మీడియా కథనాలను ప్రతిఘటిస్తూ డి రాడికలైజేషన్‌, యువత అభివృద్ధిలో భారత సైన్యం తీసుకుంటున్న చొరవలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు. ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియా వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement