రోమ్: పార్లమెంట్ ఎన్నికలు మరో ఏడాదిలో జరగనుండగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో న్యాయ వ్యవస్థ సంస్కరణలపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆమెకు నిరాశ ఎదురైంది. రెండు రోజులపాటు జరిగిన ఓటింగ్ ఊహించని రీతిలో ప్రజలు స్పందించారు.
కనీసం 54 శాతం మంది సంస్కరణలను తిరస్కరించగా, 46 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. అధికార పక్షంలో లుకలుకలు ప్రస్ఫుటం కాగా, ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరించి, ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టింది. ఈ ఫలితంతో మెలోనీ నాయకత్వం దేశంతోపాటు అంతర్జాతీయంగానూ బలహీనమైనట్లేనని పరిశీలకులు అంటున్నారు. లాయర్లు, జడ్జీలు తరచూ తమ వృత్తులను మార్చుకోకుండా నిరోధించడం, ఎన్నికకు బదులుగా లాటరీ విధానంలో ఉన్నతస్థాయి నియామకాలు చేపట్టడం వంటివి మెలోనీ తలపెట్టిన న్యాయ సంస్కరణల్లో ఉన్నాయి.
మెలోనీ స్పందన..
అయితే, ఈ తీర్పుపై తాజాగా ప్రధాని మెలోనీ స్పందించారు. ఇటలీ ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు ఈ సందర్బంగా మెలోనీ ఈ ఓటమిని “ఇటలీని ఆధునీకరించడానికి కోల్పోయిన అవకాశం” గా పేర్కొన్నారు. అయితే, తాను పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రతిపక్షం ఈ సంస్కరణలు న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తాయని ఆరోపించింది. కాగా, ఈ ఓటమి మెలోనీ నేతృత్వంలోని రైట్-వింగ్ కూటమికి పెద్ద దెబ్బగా పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా ఓటమి.. 2027 సాధారణ ఎన్నికలకు ముందు ఇది మెలోనీ ప్రజాదరణను తగ్గించే అవకాశం ఉంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణను మెలోనీ నాయకత్వానికి పెద్ద పరీక్షగా విశ్లేషకులు పేర్కొన్నారు.
Gli italiani hanno deciso. E noi rispettiamo questa decisione.
Andremo avanti, come abbiamo sempre fatto, con responsabilità, determinazione e rispetto verso il popolo italiano e verso l’Italia. pic.twitter.com/KCBf19hO8d— Giorgia Meloni (@GiorgiaMeloni) March 23, 2026


