టెహ్రాన్: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శత్రుదేశాలు దాడులకు తెగబడితే రెట్టింపు ప్రతి దాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు.
ఆదివారం మొజ్తాబా ఖమేనీతో ఇరాన్ ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ చీఫ్ కమాండర్ అలీ అబ్దుల్లాహి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారిరువురి మధ్య పశ్చిమాసియా యుద్ధం, కాల్పుల విరమణ, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అంశాలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ప్రతి దాడులు చేయాలని, శత్రువులను దృఢంగా ఎదుర్కొనేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ ఫార్స్ న్యూస్ తెలిపింది. ఇరాన్ సాయుధ దళాలు అమెరికా-ఇజ్రాయెల్ ఏ చర్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని కమాండర్ అబ్దుల్లాహి పేర్కొన్నారు. శత్రువు ఏ తప్పు చేసినా ఇరాన్ ప్రతిస్పందన వేగంగా, తీవ్రంగా ఉంటుంది అని ఆయన హెచ్చరించినట్లు ఫార్స్ న్యూస్ హైలెట్ చేసింది.
తాజా ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ సైన్యం, ఐఆర్జీసీ తరచూ అమెరికా, దాని మిత్రదేశాలకు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నాయి. హర్మూజ్ జలసంధి వంటి కీలక చమురు మార్గాల భద్రతపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.


