యూఏఈలోని షార్జాలో భారతీయ మహిళ, ఆమె ఐదేళ్ల కుమార్తె మృతి చెందిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గల్ఫ్ న్యూస్ కథనం ప్రకారం.. సదరు మహిళ తన ఐదేళ్ల కుమార్తెను 22 అంతస్తుల భవనంపై పైనుంచి కిందకు పడేసి, ఆపై తాను కూడా దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ దిగ్భ్రాంతికర ఘటన బుధవారం ఉదయం 7:15 గంటల ప్రాంతంలో జరిగింది.
మృతుల వివరాలు ఇవే..
కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఆర్ష .. తన భర్త నిహాల్, ఐదేళ్ల కుమార్తె రుహి (5)తో కలిసి షార్జాలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటోంది. ఆర్ష స్వంతంగా ఆన్లైన్ వ్యాపారం కూడా నిర్వహిస్తోంది. ఆమె సోదరి కుటంబం కూడా పక్కన పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. అయితే 35 ఏళ్ల ఆర్షకు ఏమైందో తెలియదు కానీ, తన 5 ఏళ్ల కుమార్తెతో ఆత్మహత్య చేసుకుని వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
ఆమె నివసిస్తున్న భవనంలో 22 అంతస్తు నుంచి మొదట తన ఐదేళ్ల కుమార్తెను బాల్కనీలో నుండి కిందకు విసిరేసింది. ఆ వెంటనే క్షణాల వ్యవధిలో తాను కూడా కిందకు ఆత్మహత్య చేసుకుంది.
ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో సెక్యూరిటీ గార్డ్ వెళ్లి చూసేసరికి వారిద్దరూ రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే షార్జా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె అయితే కనిపెంచిన తల్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


