సూడాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం పొరుగు దేశమైన చాద్లోకి వ్యాపించింది. మార్చి 19న జరిగిన ఘటనలో సూడాన్ నుంచి ప్రయోగించిన ఓ డ్రోన్ చాద్లోని టైన్ పట్టణంలో 17 మంది ప్రాణాలను బలిగొంది. స్థానిక నివాసి తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ఇంటి వద్ద అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో రెండు పేలుళ్లు సంభవించాయి. వాటి ధాటికి అంత్యక్రియలకు హాజరైన పలువురితో పాటు సమీపంలో ఆడుకుంటున్న పిల్లలు కూడా బలయ్యారు.
చాద్ ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. సూడాన్పై త్వరలోనే ప్రతీకారం తీసుకుంటామని ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు మహమత్ ఇడ్రిస్ డెబీ, రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించి, సూడాన్ దాడులకు తక్షణమే బదులివ్వాలని సైన్యాన్ని ఆదేశించారు. అవసరమైతే వారి భూభాగంలోనూ ఆపరేషన్లు చేపట్టాలని అన్నారు.
మరోవైపు సూడాన్ పారామిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. ఈ దాడి సూడాన్ సైన్యం పనేనని వారు ఆరోపించారు.
కాగా, సూడాన్లో సైన్యం మరియు RSF మధ్య యుద్ధం 2023 ఏప్రిల్లో ప్రారంభమైంది. ఇప్పటివరకు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 1.2 కోట్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిలో దాదాపు 10 లక్షల మంది చాద్లోకి శరణార్థులుగా చేరారు. చాద్.. సూడాన్కు సరిహద్దు దేశం.


