అయోవా: అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. కుటుంబంలోని వివాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో నిందితుడుతో సహా ఏడుగురు మృతి చెందారు. అయోవాలోని మస్కటీన్ ప్రాంతంలో ఘటన జరిగింది. మస్కటీన్ నగరంలోని రెండు నివాస గృహాలు, ఒక వ్యాపార సముదాయంలో ఈ వరుస హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం సుమారు 12:12 గంట సమయంలో పార్క్ ఎవెన్యూలోని ఒక ఇంట్లో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకునేసరికి.. ఆ ఇంటో నలుగురు వ్యక్తులు బుల్లెట్ గాయాలతో పడి ఉన్నారు. వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడిని మస్కటీన్కు చెందిన 52 ఏళ్ల రయాన్ విల్లిస్ మెక్ఫార్లాండ్గా గుర్తించారు. అయితే పోలీసులు వచ్చేసరికే అతడు అక్కడ నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటికే నిందితుడిని బ్రిడ్జి సమీపంలో గుర్తించారు. అప్పటికే అతడు తుపాకీతో తనను తాను కాల్చుకుని తీవ్ర గాయాలతో ఉన్నాడు. పోలీసులు, పారామెడికల్ సిబ్బంది అతడికి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతడు అక్కడికక్కడే మరణించాడు.
ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు నిర్థారించారు. మరణించిన వారంతా నిందితుడి కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. అయితే, మృతుల పేర్లను అధికారులు ఇంకా వెల్లడించలేదు. మీడియా నివేదికల ప్రకారం.. నిందితుడికి గతంలో క్రిమినల్ రికార్డు ఉన్నట్లు తెలుస్తోంది.


