ఇరాన్ అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ సేఫ్టీ ఏజెన్సీ ఈ రోజు (బుధవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్, ఇరాక్, లెబనాన్ గగనతలంలో తమ దేశానికి చెందిన విమానాల ప్రయాణంపై నిషేదం విధించింది. ఆగస్టు 31 వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపేమో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతుండగా మరోవైపేమా అమెరికా ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు వార్నింగ్ సైతం ఇచ్చారు. ఇరాన్తో ఇక చర్చలు ఉండవని భేటీల పేరుతో తమను మోసం చేస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు మరోసారి యుద్ధం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందని భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఐరోపా దేశాలకు చెందిన పౌర, వాణిజ్య విమానాలేవీ ఇరాన్, ఇరాక్, లెబనాన్ దేశాల గగనతలం (Airspace) లోకి ప్రవేశించవద్దని ఈసా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నిషేధాజ్ఞలు ప్రస్తుతానికి ఆగస్టు 31, 2026 వరకు అమల్లో ఉంటాయని, ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
అయితే అదేవిధంగా బహ్రెయిన్, కువైట్, ఇజ్రాయెల్, జోర్డాన్, ఖతార్, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా గగనతలంలో కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు విమానయాన సంస్థలు జాగ్రత్త వహించాలని కోరిన తమ మునుపటి అడ్వైజరీని ఉపసంహరించుకున్నట్లు ఏజెన్సీ తెలిపింది.
కాగా అమెరికా చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్ లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మిసైళ్లతో విరుచుకుపడ్డారు. ఈ క్షిపణి దాడుల వల్ల పౌర విమానాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందనే నేపథ్యంలో ఈయూ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఆదేశాల వల్ల యూరప్ నుండి ఆసియా దేశాలకు (భారత్తో సహా) ప్రయాణించే విమానాలు తమ మార్గాలను మార్చుకోవాల్సి వస్తుంది. ఇరాన్, ఇరాక్ గగనతలాలను దాటకుండా వేరే రూట్లలో ప్రయాణించడం వల్ల విమాన ప్రయాణ సమయం మరియు ఇంధన ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది.


