సికింద్రాబాద్: మాజీ సైనికుడు చైన్ స్నాచింగ్లకు పాల్పడి పోలీసులకు దొరికిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి ఐదు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ డీఎస్పీ జావెద్, ఇన్స్పెక్టర్ సాయీశ్వర్గౌడ్ తెలిపిన మేరకు.. ప్రకాశం జిల్లా గుడిమెట్టకు చెందిన అన్నపురెడ్డి శ్రీనివాస్రెడ్డి (51) మాజీ సైనికుడు. శ్రీనివాస్రెడ్డి నాగారంలో నివాసం ఉంటూ ఘట్కేసర్లోని ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. షేర్మార్కెట్లో పెట్టుబడుల ఫలితంగా నష్టపోయాడు. బెట్టింగ్లను ఆశ్రయించినా ఆశించిన ఫలితం దక్కలేదు. చివరకు రైలు ప్రయాణాల్లో మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈనెల 2, 3 తేదీల్లో ఉదయం వేళల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరే కాకతీయ ఎక్స్ప్రెస్రైలులో రెండు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. ఇద్దరు మహిళల మెడలోంచి మంగళసూత్రాలు, బంగారు గొలుసులను లాక్కొని లాలాగూడ, చర్లపల్లి ప్రాంతాల్లో రైలునుంచి దూకి పరారయ్యాడు. ఈనెల 9న మళ్లీ రైలు ఎక్కేందుకు వచ్చిన శ్రీనివాస్రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు.
అదుపులోకి తీసుకున్న పోలీసులు


