● ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులు
పంజగుట్ట: తెలంగాణ ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు ఏర్పాటు చేసిన ట్రస్టులను కొందరు తమ లబ్ధి కోసం వినియోగించుకుంటున్నారని పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు ఆగ్రహంవ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ భవనాలు ఆంధ్రా కార్పొరేట్లకు బలికావొద్దు అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు, సినీ దర్శకుడు సయ్యద్ రఫీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి మాట్లాడుతూ .. తెలంగాణ వచ్చినా ఇంకా ఆంధ్రా పెత్తనమే నడుస్తోందన్నారు. కురుమ ఆత్మగౌవర భవనాన్ని నారాయణ కాలేజీ యాజమాన్యం లీజుకు తీసుకోవడం దారుణమైన చర్య అన్నారు. నారాయణ అంటేనే చంద్రబాబు బినామీ.. నారాయణ కాలేజీ చేసే అక్రమాలు అన్నీ..ఇన్నీ కాదని, ఈ కాలేజీలను తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలో లేకుండా చెయ్యాలని పిలుపునిచ్చారు. నారాయణ తెలంగాణ ద్రోహి అని తెలంగాణ నుండి తరిమి కొట్టాలని కోరారు. వివిధ కుల సంఘాల నాయకులు గుండ్లపల్లి శ్రీనివాస్, గురునాధ్ కురుమ, శారదగౌడ్, పొల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్లు మాట్లాడారు.


