
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటరు స్లిప్పు ఉంటే సరిపోతుందనుకోవద్దని, ఐడీ కార్డు తప్పనిసరిగా ఉండాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ స్పష్టం చేశారు. ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) ఉన్నవారు ఐడీ ప్రూఫ్గా దాన్ని వెంట తీసుకువెళ్లాలని, ఎపిక్ లేకపోయినా ప్రత్యామ్నాయంగా ఫొటోతో కూడిన ఐడీ కార్డు చూపిస్తే ఓటు వేయవచ్చునని, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని పేర్కొన్నారు.
కొత్తగా ఓటరుగా జాబితాలో పేరు నమోదు చేసుకున్నవారికి ఎపిక్ కార్డులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎపిక్ లేనివారు తమ గుర్తింపు కోసం దిగువ తెలిపిన ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని పోలింగ్ కేంద్రంలో చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1.ఆధార్ కార్డు
2.ఎంఎన్ఆర్ఈఏ జాబ్కార్డు
3.పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ జారీచేసిన ఫోటోతో కూడిన పాస్ బుక్
4. కార్మిక మంత్రిత్వ శాఖ జారీచేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
5. డ్రైవింగ్ లైసెన్స్
6. పాన్ కార్డు
7. ఆర్జీఐ ద్వారా జారీ చేసిన స్మార్ట్ కార్డు
8. ఇడియన్ పాస్ పోర్టు
9. ఫొటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్
10. ఫొటోతో కూడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం/పీఎస్యూ/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ఉద్యోగ గుర్తింపు కార్డు
11.ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల అధికార గుర్తింపు పత్రం.
12. దివ్యాంగుల గుర్తింపు కార్డు.
పై వాటిల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తమ వెంట తీసుకువెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
స్పష్టం చేసిన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్