హన్మకొండ : ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఎం.మధు అన్నారు. ఈ క్రమంలో ఆపత్కాలిక పంటలైన అపరాల సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. అఖిల భారత సమన్వయ పరిశోధన పథకం–కంది, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో కంది సాగు ప్రథమ శ్రేణి ప్రదర్శనల్లో భాగంగా కంది విత్తనాల పంపిణీ కార్యక్రమం గురువారం వరంగల్ పైడిపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహ పరిశోధన సంచాలకుడు ఎం.శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు కంది విత్తనాలు అందించారు. ఆయన మాట్లాడుతూ అపరాల సాగులో భాగంగా కంది పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలన్నారు. ప్రిన్సిపల్ సైంటిస్టు కె.రుక్మిణి మాట్లాడుతూ కంది, పెసర, మినుము పంటల విస్తీర్ణం పెంచాలన్నారు. ఎఫ్ఎల్డీ ఇన్చార్జ్ ఎం.మధు కంది పంట యాజమాన్య పద్ధతులు వివరించారు. అపరాల విభాగం అధిపతి జి.శేషు మాట్లాడుతూ ఆర్.ఎ.ఆర్.ఎస్. నుంచి నూతనంగా కంది రకాలు విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డి.వీరన్న, జి.పద్మజ, ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు పాల్గొన్నారు.
● ఆపత్కాలిక పంటలపై దృష్టి సారించాలి
● ఆర్ఎఆర్ఎస్ సహ పరిశోధన సంచాలకుడు మధు


