● డీఆర్డీఓ మేన శ్రీను
ధర్మసాగర్ : ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలు పని చేసే చోట జాగ్రత్తలు పాటించాలని డీఆర్డీఓ మేన శ్రీను సూచించారు. మండల కేంద్రంలో బుధవారం కూలీలతో మాట్లాడి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేయాలని అన్నారు. అలాగే మండల రెవెన్యూ, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద సామూహిక మరుగుదొడ్లను ప్రారంభించారు. అనంతరం స్నేహ సమ్మర్ క్యాలెండర్–2026 ప్రోగ్రాంలో సురక్షిత గ్రామం, బాలికల భద్రత, బాల్య వివాహాల నిర్మూలన, సైబర్ భద్రత, మొబైల్ వినియోగంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఎంఈఓ రాంధన్, డీటీ సంతోశ్, సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా, ప్రభుత్వ అధికారులు, బాలికల సంరక్షణ కమిటీ సభ్యులు, బాలికలు, మహిళలు పాల్గొన్నారు.
శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలి
మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో 6వ సెషన్ సురక్షిత గ్రామం, పురుషులు, యువతతో భాగస్వామ్యం చర్చ, కిశోర బాలికల భద్రతపై చర్చ కార్యక్రమానికి సంబంధించిన లోగోను డీఆర్డీఓ మేన శ్రీను ఆవిష్కరించారు. బాలికలు కష్టంగా కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. ఎక్కువగా పుస్తక పఠన చేయాలన్నారు. సమ్మర్ క్యాలెండర్లో మొత్తం 13 సెషన్స్ ఉంటాయని, వారానికి రెండు సెషన్స్ ఉంటాయన్నారు. ఈ శిక్షణ శిబిరం జూన్ 10వ తేదీన ముగియనుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ జ్యోతి, ఉప సర్పంచ్ కొమురమ్మ, ఎంపీడీఓ అనిల్ కుమార్, బాలల పరిరక్షణ సమితి కోఆర్డినేటర్ శ్రీనివాస్, మహిళా సాధికారత అధికారి కల్యాణి, సర్ఫ్ డీపీఎం, హెచ్డీ, ఏపీఎం, సీసీలు, ఐసీడీఎస్ ధర్మసాగర్ వింగ్ అధికారి, సూపర్వైజర్ ముస్రత్, ఎంఈఓ రాంధన్, హెచ్ఎం మురళి, సఖి సెంటర్ ప్రతినిధులతో పాటు తదితరులు పాల్గొన్నారు.


