● శాట్ చైర్మన్ శివసేనారెడ్డి
హన్మకొండ చౌరస్తా: క్రీడాకారులకు అవసరమైన క్రీడా పరికరాల కల్పనలో లోటురాకుండా చూసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్(శాట్) శివసేనారెడ్డి సూచించారు. జిల్లా న్యాయస్థానంలో ఓ కేసు విషయంలో బుధవారం జిల్లాకు వచ్చిన ఆయన హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని పరిశీలించారు. ముందు డీవైఎస్ఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఇండోర్ స్టేడియం, స్టోర్ రూం, స్టేడియంలో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడా వసతులు, సమస్యలు, క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ, కోచ్ల వివరాలను డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ను అడిగి తెలుసుకున్నారు. క్రీడాభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. డీఎస్ఏ ఆఫీస్ సూపరింటెండెంట్ విజయశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు.
కేసీఆర్ బొమ్మ మార్చి పంపిణీ చేయండి..
హనుమకొండలోని జిల్లా క్రీడాప్రాధికార సంస్థను పరిశీ లించేందుకు విచ్చేసిన శివసేనారెడ్డికి వింత అనుభవం ఎదురైంది. ఇండోర్ స్టేడియం లోపల పై అంతస్తులోని స్టోర్ రూంలో లక్షలాది రూపాయల విలువైన క్రీడా పరికరాలపై దుమ్ము పేరుకుపోయి కనిపించింది. నిరుపయోగంగా ఉన్న ఆట వస్తువుల కిట్లపై మాజీ సీఎం చంద్రశేఖర్రావు బొమ్మ ఉండడాన్ని గమనించారు. కేసీఆర్ బొమ్మ మార్చి అర్హులైన క్రీడాకారులకు క్రీడా సామగ్రి వెంటనే అందించాలని డీవైఎస్ఓ ప్రశాంత్ను ఆదేశించారు.


