వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గొర్ల సీతారెడ్డి, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సార్ల రాజు, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్పెక్టర్ బోలగాని శ్రీనివాస్గౌడ్ ఉన్నారు. పదోన్నతి పొందిన వారిని అధికారులు అభినందించారు.
అదనపు కలెక్టర్ ఎన్.రవి
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్షను ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లతో కలిసి ఆయన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 8 పరీక్ష కేంద్రాల్లో 4,320 మంది పరీక్షలు రాయనున్నారని, వారికి మౌలిక వసతులు కల్పించాలని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో నీట్ జిల్లా కో–ఆర్డినేటర్ భిక్షపతి, ఏసీపీ నరసింహారావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


