హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లందరూ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. ముందుగా హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వందలాదిగా ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్రేట్ వర్కర్లు తరలొచ్చారు. ఫలితంగా ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట ఉన్న ప్రధాన రహదారి విద్యుత్ కార్మికులతో నిండిపోయింది. ఉద్యోగుల నినాదాలతో దద్దరిల్లింది. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పేద ఉద్యోగులైన ఆర్టిజన్, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్, బిల్ కలెక్టర్ల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇంత మంది పేద ఉద్యోగులను రోడ్డు మీద పడేయడం సరికాదన్నారు. ఆర్టిజన్లను రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలదేనన్నారు. వెంటనే ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీని చర్చలకు పిలిచి సమ్మెను నివారించాలన్నారు. సమ్మెకు పవర్ ఎంప్లాయీస్ జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగ సంఘాలన్నీ ఆర్టిజన్లకు మద్దతుగా ఏకమై సమ్మెకు వెళ్లేలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శశికుమార్ మాట్లాడుతూ పీస్ వర్క్ కార్మికులకు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని, దశలవారీగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం–1535 నాయకుడు వజీర్ మాట్లాడుతూ విద్యుత్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు, టీఎస్ఈఈయూ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ మాట్లాడుతూ ఆర్టిజన్ల సమస్యలు న్యాయమైనవని, వాటిని పరిష్కరించాలన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎస్.సతీశ్ రెడ్డి, కన్వీనర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లందరూ సమ్మెలోకి రావాలని పిలుపునిచ్చారు. మహాధర్నాలో ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ ధరావత్ సికిందర్, రాష్ట్ర నాయకులు సాయిలు, శ్రీధర్ గౌడ్, చందర్ సింగ్, ప్రశాంత్, వెంకన్న, ఎ.శ్రీకాంత్, దమ్మ రవీందర్, అటికేటి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ సంఘాల నాయకుల పిలుపు
టీజీఎన్పీడీసీఎల్ కార్యాలయం వద్ద ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చిన కార్మికులు
సమ్మెకు మద్దతు ప్రకటించిన
ఉద్యోగ సంఘాలు


