● మంత్రి చేతుల మీదుగా అందుకున్న ప్రిన్సిపాల్ సంధ్య
రామన్నపేట : నగరంలోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) మరోసారి తన ప్రతిభను చాటుకుంది. డయాలసిస్ సేవలు, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కాళోజీ విశ్వవిద్యాలయం వీసీ రమేశ్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేంద్ర కుమార్ చేతుల మీదుగా కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్య సుంకరనేని అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంధ్య మాట్లాడుతూ ఈ విజయానికి ఆర్థోపెడిక్ విభాగం అధిపతి రామకుమార్ రెడ్డి, నెఫ్రాలజీ విభాగం అధిపతి చాడా రమేశ్ సమర్థ నాయకత్వంతో పాటు వారి బృందాల నిరంతర శ్రమ ప్రధాన కారణాలుగా నిలిచాయని తెలిపారు. అలాగే, ఆస్పత్రి సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డి మార్గదర్శకం ఈ విజయానికి ఆధారంగా నిలిచిందన్నారు. ఈ గుర్తింపు కేఎంసీ వైద్యులు, సిబ్బంది అంకితభావానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.
వాసు మృతదేహం లభ్యం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ఈఈఈ విభాగం ఫైనలియర్ విద్యార్థి భూక్య వాసు(22) ఈనెల 5న ఈతకోసం కెనాల్లోకి వెళ్లి గల్లంతైన విషయం విధితమే. ఎన్డీఆర్ఎఫ్ బృందం రెండోరోజు మంగళవారం కూడా బోట్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టగా మొగిలిచర్ల ప్రాంతంలో కెనాల్లో మృతదేహం లభ్యమైందని కేయూ సీఐ రవికుమార్ తెలిపారు. వాసు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించనట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
డోర్నకల్: వరంగల్ సమీపంలోని కాకతీయ కెనాల్లో ఈతకెళ్లి గల్లంతై చనిపోయిన బీటెక్ విద్యార్థి భూక్యా వాసు అంత్యక్రియలు మంగళవారం డోర్నకల్ మండలం చిమ్నాతండాలో ముగిశాయి. వాసు మృతదేహాన్ని తండాకు తీసుకొచ్చి తల్లి పార్వతి, సోదరుడు కార్తీక్.. అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, వాసు మృతితో చిమ్నాతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సీకేఎం ఆస్పత్రిలో తనిఖీ
కాశిబుగ్గ: వరంగల్లోని సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘సాక్షి’లో మంగళవారం ‘సీకేఎంలో ఆగని మాముళ్ల దందా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ ప్రసూతి ఆస్పత్రిని సందర్శించారు. ఆయన నేరుగా లేబర్ రూంకు వెళ్లి డబ్బులు వసూళ్లపై ఆరా తీశారు. ఇలా ఎందుకు జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పేద రోగులకు అంకితభావంతో సేవలు అందించాలని ఆయన సూచించారు. దీనిపై కలెక్టర్ సీరియస్గా ఉన్నారని, మళ్లీ జరిగితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.


