కాజీపేట అర్బన్: ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మిద్దామని ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్.శ్రావణ స్వాతి అన్నారు. కాజీపేట మండలం కడిపికొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.రామలింగం అధ్యక్షతన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి శ్రావణ స్వాతి హాజరై మాట్లాడారు. ప్రతీ ఏడాది ఏప్రిల్ 7వ తేదీని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ డేగా పరిగణించిందని, వైద్య శాస్త్రం అందిస్తున్న ఆధునిక విజ్ఞాననంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు. శారీరక, మానసిక, సామాజిక ఆనందాల కలయికే సంపూర్ణ ఆరోగ్యమన్నారు. బీపీ, షుగర్, గుండె సమస్యలు నేడు పెరిగిపోతున్నాయని, ముందస్తు జాగ్రత్తలు పాటించి అనారోగ్యాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కవిత, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కిరణ్సింగ్, మెడికల్ ఆఫీసర్ బజన్లాల్, డీఈఎంఓవీ అశోక్రెడ్డి, మడికొండ ఎస్ఐజీ రామ్మోహన్, పల్లె దవాఖాన వైద్యాధికారులు సంతోశ్, ఇర్ఫాన్, గీతాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి
సీహెచ్.శ్రావణ స్వాతి


