బీరమయ్య జాతరకు తరలివచ్చిన భక్తజనం | - | Sakshi
Sakshi News home page

బీరమయ్య జాతరకు తరలివచ్చిన భక్తజనం

Apr 6 2026 9:24 AM | Updated on Apr 6 2026 9:24 AM

లొట్టిపిట్ట గండిలో గిరిజనుల కోలాహలం

దేవర్ల రాకతో మొదలైన జాతరతంతు

వాజేడు: మండల పరిధిలోని లొట్టిపిట్ట గండి ప్రాంతం ఆదివారం తెల్లవారు జాము నుంచి బీరమయ్య నామస్మరణతో మార్మోగింది. మండు టెండలో తెలంగాణ– ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతమైన లొట్టిపిట్టగండి వద్ద కొండలపైన గిరిజనుల ఆరాధ్య దైవమైన బీరమయ్య (భీష్మశంకరుడు) జాతర శనివారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా బీరమయ్య నామస్మరణతో మార్మోగింది. ఆదివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో సమీప గోదావరిలో నిష్టతో స్నానాలు ఆచరించి బీరమయ్య, రేఖలమ్మలకు ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం కల్యాణం జరిపించారు. భక్తులు వివిధ వాహనాల్లో భారీగా తరలివచ్చి బీరమయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం రాత్రి నుంచి జాతర ప్రాంతంలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లను చేశారు. గుట్టపైన ఉన్న గుడికి చేరే సమయంలో భక్తులకు ఎండ తగలకుండా ఉండేలా నీడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల దాహం తీర్చడానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్‌ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రతిఏటా బీరమయ్య జాతర సమయంలో భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేవారు. కాని రెండేళ్లుగా బస్సులు నడపడం లేదు. దీంతో జాతరకు వచ్చే భక్తులు ప్రైవేట్‌ వాహనాల్లో జాతరకు రావాల్సిన దుస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement