హన్మకొండ చౌరస్తా: వరంగల్ ట్రైసిటీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి, మానవాళి మనుగడ కోసం శనివారం నిర్వహించిన రన్ ఫర్ జీసస్’ ర్యాలీలో చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమకొండలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వద్ద ప్రారంభమైన ర్యాలీకి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హాజరై మాట్లాడారు. వరంగల్ మత సామరస్యానికి ప్రతీక అని, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలగలిపిన రన్ ఫర్ జీసస్ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుందన్నారు. రన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. ట్రైసిటీ నుంచి క్రైస్తవులు ప్లకార్డులు చేతబూని అధిక సంఖ్యలో రన్లో పాల్గొన్నారు.
హన్మకొండ: సమస్యల పరిష్కారానికి ఈనెల 7న హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను ఆర్టిజన్ ఉద్యోగులు, ఆన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, పీస్ రేట్ వర్కర్లు విజయవంతం చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ట్రాన్స్ కో రాష్ట్ర కన్వీనర్ కందికొండ వెంకటేశ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు జేఏసీతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఈ నెల 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఆయన శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.


