కేయూ క్యాంపస్: కర్నాటకలోని దేవనగరి యూనివర్సిటీలో ఏప్రిల్ 1 నుంచి 4వతేదీ వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఖోఖో టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టు పాల్గొననున్నట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య మంగళవారం తెలిపారు. ఈ జట్టులో జి. అఖిల, పి. శి రీష్మా, జి. పూజారాణి, కె. కావ్య,టి రజిత, ఇ. సమత, ఎం. నవ్య, బి. శైలజ, ఇ. శ్రీజ, ఎ. నందు, కె. సుమతి, కె నిష్మితా, కె. ఉషారాణి, ఎం. శిరీషా ఉన్నారని వెంకయ్య పేర్కొన్నారు. ఈజట్టుకు వరంగల్ ఎల్బీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎ. రాజు కోచ్గా, ఖమ్మం డీజీటీడబ్ల్యూ ఆర్డీసీ ఫిజికల్ డైరెక్టర్ బి. రమ్య మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు.
పంటమార్పిడితో
నేల ఆరోగ్యం
హసన్పర్తి : పంటమార్పిడి విధానం అవలంబించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి అన్నారు. భీమారంలోని రైతు వేదికలో మంగళవారం రైతులకు పంటమార్పిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పత్తి పంట తర్వాత అపరాల పంట, నువ్వులు సాగు చేయాలన్నారు. వానాకాలంలో వరి, యాసంగిలో వరి కాకుండా ఆరుతడి పంటలైన పెసర, మినుములు, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేయడం ద్వారా మట్టిలో పోషకాలు సమతుల్యంగా ఉంటాయన్నారు. ఆదర్శ రైతు ఆదిరెడ్డి మాట్లాడుతూ కంది పంటకు మద్దతు ధర పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ ఆదిరెడ్డి, శాస్త్రవేత్త మాధవి, వ్యవసాయాధికారిణి అనురాధ, ఏఈఓలు భాస్కర్, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలు
న్యూశాయంపేట: ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలను నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలుపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామసభలకు వార్డు సభ్యుల నుంచి ఎంపీలు, మంత్రుల వరకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. వీసీ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావు, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేష్, సీఈఓ రాంరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఒకేసారి మూడు నెలల బియ్యం
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలోని 509 రేషన్ షాపుల్లో బుధవారం నుంచి మూడు నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నారు. అందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేటలోని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి 509 షాపులకు సన్న బియ్యం చేరుకున్నాయి. మూడు నెలలకు గాను 16,782.804 మెట్రిక్ టన్నుల బియ్యం ఒకేసారి ఇచ్చేందుకు తగినన్ని నిల్వలను అందుబాటులో ఉంచారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 7 గంటల వరకు రేషన్ షాపులు తెరిచి ఉంటాయని, పోర్టబుల్ ద్వారా ఎక్కడైనా బియ్యాన్ని కార్డుదారులు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.


