వరంగల్ చౌరస్తా : రైతులు పండించిన ప్రతీ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని జస్టిస్ బి. చంద్రకుమార్, ప్రొఫెసర్ వెంకట్ నారాయణ పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ అబ్బనికుంటలోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో రాష్ట్ర రైతు సంక్షేమ సమితి, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కన్వీనర్ సోమిడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సదస్సు ప్రారంభానికి ముందు ఇటీవల మృతి చెందిన రైతు ఉద్యమ నేత, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత కూసం రాజమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో కొత్త వంగడాలను తయారు చేసి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసినప్పుడే నిరుద్యోగం నిర్మూలనవుతుందన్నారు. 60 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఇలాంటి రంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నాలను కొనసాగిస్తున్నాయని విమర్శించారు. గత కేంద్ర ప్రభుత్వం రైతు ఆత్మహత్యల నివారణతోపాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా డాక్టర్ స్వామినాథన్ కమిటీని నియమించిందన్నారు. ఈ కమిటీ కొత్త వంగడాలను రూపొందించి రైతాంగానికి దిగుబడి వచ్చే విత్తనాలను అందించాలని సూచించిందన్నారు. అయితే ఆ సిఫార్సులను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. అనంతరం పలు తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. విత్తనం, విద్యుత్, మార్కెట్ కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాల ని, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రభుత్వమే 50శాతం సబ్సిడీతో అందించాలని, ఫసల్ బీమా పథకాన్ని కొనసాగించాలని, ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించారు. నాయకులు ఓదల రాజయ్య, సోమ రామ్మూర్తి, పల్నాటి మల్లేశం, వంగూరు నర్సింహ, వన్నాల తిరుపతిరెడ్డి, వివిధ జిల్లా బాధ్యులు తిరుపతి, మస్కు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
స్వామినాథన్ కమిటీ సిఫార్సులను
అమలు చేయాలి
రాష్ట్ర సదస్సులో జస్టిస్ బి. చంద్రకుమార్, ప్రొఫెసర్ వెంకట్ నారాయణ


