ఎంజీఎం : మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడంలో వైద్యులు నిబంధనలు అతిక్రమించారని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు మంగళవారం ఎంజీఎం సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారి కథనం ప్రకారం.. ఇటీవల మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇజ్జగిరి సుజాత (40) తీవ్ర గాయాలపాలై ఎంజీఎంలో చికిత్స పొందింది. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయింది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భంలో బాధితురాలి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన మిల్స్ కాలనీ పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే ముందు చేపట్టే పంచనామాలో తండ్రి సంతకం తీసుకోకపోవడంతోపాటు కనీస సమాచారం అందించలేదు. దీంతో పోస్టుమార్టం నిర్వహణలో నిబంధనలు అతిక్రమించారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. కాగా, ఈ విషయంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని, నిబంధనల మేరకే పోస్టుమార్టం నిర్వహించామని ఆర్ఎంఓ అశ్విన్ వివరించారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు.
మృతురాలి బంధువుల ఆరోపణ
ఎంజీఎం సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట ఆందోళన


