జల్సాల కోసం చోరీలు..
వరంగల్ క్రైం: జల్సాల కోసం బైక్ చోరీలకు పాల్ప డుతున్న ఏడుగురు సభ్యుల గల ముఠాను సంగెం, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసినట్ల ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఈమేరకు గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టుబడిన ఏడుగురిలో నలుగురు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. హనుమకొండకు చెందిన దరాంగుల అంజి, వరంగల్ ఉర్సుకు చెందిన సంతోష్, కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన జైదా రామకృష్ణతోపాటు నలుగురు మైనర్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. హనుమకొండలోని ఒకే ప్రాంతంలో నివాసం ఉండడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో నిత్యం మ ద్యం సేవిస్తూ జల్సాలు చేసే వారు. అయితే జల్సాలకు డబ్బులు లేకపోవడంతో చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. దీనికి పార్క్ చేసిన వాహనాలను ఎంచుకున్నారు. అనుకున్నదే తడువుగా వరంగల్తోపాటు హైదరాబాద్లో తాళం వేసి ఉన్న 15 బైక్లను అపహరించి హనుమకొండ పద్మాక్ష్మి గుట్ట ప్రాంతంలో భద్రపరిచారు. ఈనెల 1న సంగెం పీఎస్ పరిధిలోని ఆశాలపల్లిలో మరో బైక్ చోరీ చేయగా వాహన యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం సంగెం మండలం గవిచర్లలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా చోరీ చేసిన రెండు వాహనాలపై నిందితులు వస్తున్నారు. వీరిపై అనుమానం కలగడంతో పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా నేరం ఒప్పుకున్నారు. దీంతో అరెస్ట్ చేసి సుమారు రూ. 15లక్షల విలువైన 15 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. కాగా, మామునూరు ఏసీపీ వెంకట్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్, సంగెం ఎస్సై వంశీ కృష్ణ, ఏఏఓ సల్మాన్ పాషా, సంగెం హెచ్సీ సంతోష్, బాబు, కానిస్టేబుళ్లు శ్రవణ్, యాకూబ్ పాషా, నవీన్, కార్తీక్ను డీసీపీ అభినందించారు.
ఏడుగురి అరెస్ట్..15 బైక్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీసీపీ అంకిత్ కుమార్


