వలస కూలీలకు విముక్తి ..
మామునూరు : పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వలస వచ్చిన కార్మికులకు న్యాయమూర్తి అండగా నిలిచారు. కనీస అవసరాలు కల్పించకుండా శ్రమ దోపిడీకి గురవుతున్న వారికి విముక్తి కల్పించారు. సొంత రాష్ట్రం ఒడిశాకు పంపించారు. గురువారం వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి (న్యాయమూర్తి) ఎం.సాయికుమార్ ఆధ్వర్యంలో మామునూరు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కరుణాకర్, లేబర్ అధికారుల నేతృత్వంలో బొల్లికుంటలోని ఈ.ఎస్.కె మార్క్ ఇండస్ట్రీస్ ఇటుక బట్టీలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది కార్మికులు దయనీయ స్థితిలో పని చేయడాన్ని గమనించారు. వారి పని వేళలు, అందుతున్న సౌకర్యాలు, వేతనాల గురించి ఆరా తీసి శ్రమ దోపిడీకి గురవుతున్నట్లు తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులను పిలిచి కార్మికుల పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లించేలా ఆదేశించడమేకాకుండా వారు తమ రాష్ట్రానికి చేరుకునేలా రవాణా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తమను ఆదుకుని స్వస్థలాలకు పంపిస్తున్న న్యాయస్థానం, అధికారులకు కార్మికులతోపాటు సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వినోద, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్.సురేశ్, బట్టి నిర్వాహకుడు శివకృష్ణ, పారా లీగల్ వలంటీర్ హనుకాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఇటుక బట్టీలో న్యాయమూర్తి తనిఖీ
కార్మికుల దయనీయ స్థితిని చూసి అధికారులపై ఆగ్రహం
న్యాయమూర్తి ఆదేశాల మేరకు
స్వరాష్ట్రానికి పంపిన అధికారులు


