ట్రేడ్ ఫీజులో గోల్మాల్!
జీడబ్ల్యూఎంసీ వివరాలు
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ఖజానాకు చేరాల్సిన ఆదాయానికి శానిటరీ సిబ్బంది గండి పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవాలను దాచిపెట్టి, కమర్షియల్ వ్యాపారులతో కుమ్మక్కై తూతూమంత్రంగా ఫీజు విధించి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో వ్యాపార వైశ్యాలం, చెల్లిస్తున్న ట్రేడ్ లైసెన్స్ ఫీజును చూసి అవాకై ్కన జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వ్యవహారంపై సీరియస్గా దృష్టి కేంద్రీకరించారు. వరంగల్లో కూడా వ్యాపార, వాణిజ్య సంస్థల వైశాల్యంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కూడా శానిటరీ ఇన్స్పెక్టర్లు, వింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించి హెచ్చరికలు జారీ చేశారు.
ఆదాయం పెంపుపై పురపాలక శాఖ దృష్టి..
స్థానిక సంస్థల బలోపేతం చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ఆదాయం పెంపుపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా 2020 సెప్టెంబర్లో ప్లింత్ ఏరియా ఆధారంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు విధించాలని 147 జీఓ జారీ చేసింది. బల్దియా పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్లు, షాపులు, దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు వేలల్లో ఉన్నాయి. రెండున్నర ఏళ్లపాటు అధికారులు జీఓను తొక్కి పెట్టారు. ఈ జీఓ ఉత్తర్వుల అమలుపై ‘సాక్షి’ దినపత్రిక పలుమార్లు ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఎట్టకేలకు స్పందించిన అధికారులు, సిబ్బంది ఆరు నెలలపాటు వ్యాపార సంస్థల కొలతలు వేసి ఫ్లింత్ ఏరియా ఆధారంగా ఫీజు విధించారు.
నామామత్రపు ఫీజుతో సరి..
నగర వ్యాప్తంగా 1,77,666 అసెస్మెంట్లు ఉన్నాయి. అందులో కమర్షియల్ అసెస్మెంట్లు 35వేలకు పైగా ఉన్నాయి. ట్రేడ్ లైసెన్స్లు 26,650 ఉండగా.. రూ.5.27 కోట్లకు చేరింది. కార్పొరేషన్లో కాసుల వేటకు కాచుకొని కూర్చున్న ఓ వర్గానికి ఈ పునరుద్ధరణ కనక వర్షం కురిపిస్తోంది. మార్కెట్ డిమాండ్, వైశాల్యం కొలతల ఆధారంగా దుకాణాల ధరలు నిర్ణయిస్తారు. లెక్కలపై కనీస అవగాహన లేని జవాన్లు ఇష్టారాజ్యంగా కొలతలు వేసి మామ అనిపించారు. అంతేకాకుండా మాల్స్, పరిశ్రమలు, కమర్షియల్ కాంప్లెక్స్ల కొలతల్లో మాయాజాలం ప్రదర్శించి పెద్ద ఎత్తున చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా చూసీచూడనట్లుగా ఉన్నారని సమాచారం. గతంలో ట్రేడ్ లైసెన్స్ ద్వారా ఏడాదికి రూ.2.60 కోట్ల ఆదాయం సమకూరేది. ఫ్లింత్ ఏరియా ఆధారంగా ఆదాయం కాస్త రూ.5.27 కోట్లకు చేరింది. నగరంలో మల్టీలెవల్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, కోల్డ్ స్టోరేజీలు, పరిశ్రమలు, 5 స్టార్ హోటళ్లు, ఆస్పత్రులు పెద్దఎత్తున వెలిశాయి. కానీ, ఆశించిన ఫీజు విధించడంలో జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల వైఫల్యం అడుగడుగునా కనిపించింది. దీంతో బల్దియా ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడింది. అంతేకాకుండా నగరంలో వేలాదిగా ట్రేడ్ లైసెన్స్ల వ్యాపార సంస్థలున్నాయి. బల్దియా సిబ్బంది వాటి జోలికి వెళ్లడం లేదు. మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నగర వ్యాప్తంగా ఉన్న భారీ, మధ్య తరహా దుకాణాల ట్రేడ్ లైసెన్స్లను రివైజ్డ్ చేస్తే బల్దియాకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఇప్పటికై నా బల్దియా ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటే బల్దియాకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది.
రివైజ్డ్ చేస్తున్నాం..
ట్రేడ్ లైసెన్స్ ఫ్లింత్ ఏరియా వైశాల్యంలో తేడాలున్నాట్లు మా దృష్టికి వచ్చింది. మూడు రోజులుగా రివైజ్డ్ ప్రక్రియ ప్రారంభించాం. ఏ షాపును వదిలే ప్రసక్తే లేదు. వాస్తవ కొలతలకు అనుగుణంగా ఫీజు చెల్లించాల్సిందే.
– రాజారెడ్డి, సీఎంహెచ్ఓ
డివిజన్లు : 66
మహా నగర జనాభా: 12 లక్షలు
భవనాలు (అసెస్మెంట్ల) సంఖ్య
1,77,666..
ఆదాయం రూ.172.14 కోట్లు
కమర్షియల్ అసెస్మెంట్లు 31,638 ..
ఆదాయం రూ.80 కోట్లు
ట్రేడ్ లైసెన్స్లు : 26,650
మొత్తం బకాయిలు రూ. 9.27కోట్లు..
వసూళ్లు రూ.2.92 కోట్లు
రివైడ్జ్ చేస్తే రూ.10 కోట్లపైనే ఆదాయం
తూతూమంత్రంగా దుకాణాల
వైశాల్యం నమోదు
నిద్రమత్తులో జోగుతున్న
ప్రజారోగ్యం అధికారులు
గ్రేటర్ వరంగల్ ఆదాయానికి
భారీగా గండి


