ఔట్సోర్సింగ్తోనే కలెక్షన్లు
టార్గెట్లు పెట్టి మరి రెక్కీ..
వరంగల్ అర్బన్ : కొత్తగా నిర్మిస్తున్న, పూర్తయిన భవనాలు, సముదాయాలే టార్గెట్గా ఔట్సోర్సింగ్ చైన్మెన్లు, మరోవైపు బిల్ కలెక్టర్లు నిబంధనల పేరిట యజమానులను భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతి లేదని, ఒకవేళ ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం సాగుతోందని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విమర్శలున్నాయి. వామ్మో ఇంతమొత్తంలో తాము చెల్లించలేమని యజమానులు పేర్కొంటుండడంతో ఎవరికీ అనుమానం రాకుండా సదరు బిల్లింగ్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు, వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో ఇంజనీర్లు అభివృద్ధి పనుల పేరిట వర్క్ ఇన్స్పెక్టర్లను, లైన్మెన్లను పర్సంటేజీల కోసం వాడుకుంటున్నట్లు.. టిఫిన్ సెంటర్ నుంచి పెద్ద హోటల్ వరకు, ప్లాస్టిక్ షాపులు, కార్మికులు హాజరు వేసి విధులకు డూమ్మా కొట్టిన తదితర అంశాల్లో జవాన్ల ద్వారా శానిటరీ ఇన్స్పెక్టర్లు కాసుల బేరసారాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఉద్యానవన విభాగం, అర్బన్ మలేరియాలో ఇదే పరిస్థితి దాపురించిందని పలువురు చెప్పుకుంటున్నారు.
నాలుగున్నర వంతు ఔట్సోర్సింగ్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో సుమారు 700 మంది వరకు పర్మనెంట్ ఉద్యోగులు, అధికారులు ఉన్నారు. ఔట్సోర్సింగ్, కార్మికులు, సిబ్బంది 3,208 మంది ఉన్నారు. అంటే ఒకవంతు పర్మనెంట్ ఉద్యోగులు ఉంటే.. నాలుగున్నర వంతులో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.
హోదాల వారీగా పంపకాలు..
ఔట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా వసూలు చేసిన సొమ్మును తాము మాత్రం తీసుకోవడం లేదని, వివిధ హోదాల్లోని ఉన్నతాధికారుల వరకు వాటాలుగా ముట్టచెబుతున్నామని క్షేత్రస్థాయిలో ఉద్యోగులు చెబుతున్నారు. పోస్టింగ్లు, అంతర్గత, ఇతర ప్రాంతాల్లో బదిలీలకు పాలక వర్గం పెద్దలు, ప్రజాప్రతినిధులుకు, అధికారులకు సొమ్ము చెల్లించుకోవాల్సి వస్తోందని నిట్టూరుస్తున్నారు. ఇలా బల్దియాలో ప్రతీ విభాగంలో అవినీతి రాజ్యమేలుతోందనే విమర్శలున్నాయి. ఈ విషయంపై ఆయా విభాగాల అధికారులను వివరణ కోరితే అదేమీ లేదని సమాధానమిచ్చారు.
తెల్లారితే డివిజన్లలో
ఇంటింటా జల్లెడ
నిబంధనల పేరిట
అడ్డగోలుగా వసూళ్లు
బల్దియాలో బరితెగిస్తున్న
అవినీతిపరులు
పట్టించుకోని పాలకులు,
ఉన్నతాధికారులు
ఆయా విభాగాల్లోని బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు వసూళ్ల కోసం తమ వద్ద పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిత్యం కేటాయించిన డివిజన్లలో ఇంటింటా జల్లెడ పట్టాలని ఆదేశాలిస్తూ భవన నిర్మాణం జరుగుతుంటే రెక్కీ మాదిరిగా సదరు చైన్మెన్ అక్కడికి చేరుకుని పర్మిషన్ కాపీ అడుగుతున్నట్లు భవన యజమానులు చెబుతున్నారు. లేదంటే రూ.20వేల నుంచి భవన నిర్మాణాన్ని ఆధారంగా రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు వాపోతున్నారు. పర్మిషన్ ఉంటే రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు, లేకపోతే రూ.లక్ష వరకు తీసుకుంటూ పన్ను విధిస్తున్నట్లు సమాచారం. చివరికి డీజిల్, ఫాగింగ్.. ప్రతీ పనిలో ఔట్సోర్సింగ్ సిబ్బంది, కార్మికుల ద్వారా అక్రమ వసూళ్లకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ కారణాలు చెబుతూ వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


