ఆటోను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్
● ఐదుగురు ఉపాధ్యాయినులు,
ఆటో డ్రైవర్కు తీవ్రగాయాలు
మహబూబాబాద్ రూరల్ : అతివేగం.. అజాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఓ ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఐదుగురు ఉపాధ్యాయినులు, ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని శనిగపురం శివారు కుమ్మరికుంట తండాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. కురవి మండలం నేరడలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న ఐదుగురు ఉపాధ్యాయినులు శుక్రవారం మహబూబాబాద్ నుంచి ఆటోలో బయలుదేరారు. శనిగపురం శివారు కుమ్మరికుంట తండా వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ పచ్చిపాల మల్లేష్, ఉపాధ్యాయినులు చెన్నబోయిన రాధ, బానోత్ కళావతి, మద్దెల సింధూజ, వేల్పుగొండ శైలజ, నారపోగు స్వరూపకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో పైలట్ జక్కుల వీరన్న, ఈఎంటీ శ్రీనివాస్ క్షతగాత్రులను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్ఎంఓలు హర్షవర్ధన్, జగదీశ్వర్, సీఎంఓ రాంరెడ్డి వారికి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమించిన ఉపాధ్యాయినులు రాధ, కళావతిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా మల్లేష్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. కాగా ఆటోను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో గాయపడిన ఉపాధ్యాయినులను డీఈఓ దక్షిణామూర్తి, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, జీసీడీఓ విజయకుమారి, ఏఎస్సీ సంతోష్, స్పెషల్ అధికారులు, సీఆర్పీలు పరామర్శించారు.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ..
మహబూబాబాద్తో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి రాకపోకలు సాగించే ఇసుక రవాణా ట్రాక్టర్ల అతివేగంతో ప్రయాణాలు, ఇసుక అక్రమ నిల్వలపై పోలీసు, రెవెన్యూ, మైనింగ్, ఇతర సంబంధిత శాఖల అధికారుల పర్యవేక్షణ లోపంతో నిత్యం సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు అడ్డుఅదుపు లేకుండా నడుపుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
దేవరుప్పుల : ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఓ బాలిక దుర్మరణం చెందింది. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరు వాగు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై ఊర సృజన్కుమార్ కథనం ప్రకారం.. చిన్నమడూరు రెవెన్యూ పరిధి రంబోజీగూడెనికి చెందిన నక్కిరెడ్డి కృష్ణారెడ్డి కూతురు పూజ (13) చిన్నమడూరు హైస్కూల్లో 8వ తరగతి చదువుతోంది. శుక్రవారం స్వగ్రామం నుంచి సైకిల్పై పూజ పాఠశాలకు వెళ్తుండగా చిన్నమడూరు వాగు వద్ద ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ గుర్రం కుమార్ వేగంగా వచ్చి ఆ బాలికను ఢీకొట్టాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలు కాగా, వెంటనే సమాచారం అందుకున్న ట్రాక్టర్ యజమాని మైదం జోగేశ్వర్ బాలికను జనగామలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
బాలల దినోత్సవంలో అలుముకున్న విషాదం
ఓ పది నిమిషాలైతే బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొనే పూజ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అటు పాఠశాలలో, ఇటు ఇంటి వద్ద తీవ్ర విషాదం అలుముకుంది.
బాలిక ప్రాణం తీసిన ఇసుక ట్రాక్టర్
ఆటోను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్
ఆటోను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్
ఆటోను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్
ఆటోను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్


