
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు ఫీజుల పెంపు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల్లో (2025–2026) ప్రవేశాలు పొందిన ఫస్టియర్ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు వివిధ రకాల ఫీజులు భారీగా పెంచారు. ఈ మేరకు ఆయా ఫీజుల వివరాలను ప్రైవేట్ కళాశాలలకు కూడా సమాచారం అందించారు. ఒక్కో విద్యార్థికి రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో రూ. 80 ఉండగా ఇప్పుడు రూ. 1,200కు పెంపుదల చేశారు. రికగ్నిషన్ ఫీజు గతంలో రూ. 400 ఉండగా ఇప్పుడు రూ. 800కు, ఐయూడీఎఫ్ ఫీజు గతంలో రూ. 60 ఉండగా ఇప్పుడు రూ. 300కు, ఎస్డబ్ల్యూఎఫ్ ఫీజు గతంలో రూ. 50 ఉండగా ఇప్పుడు రూ. 200కు పెంపుదల చేశారు. ఒక్క పరీక్ష ఫీజు మాత్రం రూ. 750 గతంలో మాదిరిగానే యథావిధిగా ఉంచారు. గతంలో ఒక్కో విద్యార్థి ఆయా అన్ని రకాల ఫీజుల కింద రూ. 1,340 చెల్లించేవారు. ఇప్పుడు ఏకంగా ఆయా ఫీజులు అన్ని కలిపి రూ.3,250కి పెంపుదల చేశారు. గతంలోకంటే ఒకేసారి ఒక్కో విద్యార్థిపై రూ. 1,910ఫీజు భారం మోపారు. ఒకేసారి ఇంత భారీ మొత్తంలో పెంచిన ఫీజులతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
పెంచిన ఫీజులు తగ్గించాలని వినతి..
కేయూ పరిధిలో డిగ్రీకోర్సుల మొదటి సెమిస్టర్ విద్యార్థులకు భారీగా పెంచిన వివిధ రకాల ఫీజులను తగ్గించాలని బుధవారం పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు.. రిజిస్ట్రార్ రామచంద్రాన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయా ఫీజుల స్ట్రక్చర్ను రివైజ్డ్ చేయాలని విన్నవించారు.