
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం స్ఫూర్తిదాయకం
హన్మకొండ అర్బన్: తెలంగాణ కోసం ఉద్యమించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం స్ఫూర్తిదాయకమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. బీసీ సంక్షేమ శాఖ కలెక్టరేట్లో శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఎంపీ కావ్య, కలెక్టర్ స్నేహ శబరీష్, అధికారులు పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. దేశానికి బాపూజీ మహాత్మా గాంధీ అని, తెలంగాణకు బాపూజీ కొండా లక్ష్మణ్ అని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించిందన్నారు. బీసీ భవన్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటుకు ప్రతిపాదనలిస్తే ఎమ్మెల్యేతో కలిసి వాటి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో బీసీ భవన్ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. సమావేశంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చందా మల్లయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, అధికారులు, పద్మశాలి సంఘం నాయకులు గడ్డం కేశవమూర్తి, శ్యాంసుందర్ పాల్గొన్నారు.
లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితోనే
ప్రత్యేక రాష్ట్ర సాధన
న్యూశాయంపేట: కొండా లక్ష్మణ్ బాపూజీ స్పూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర సాధన సాధ్యమైందని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ కొత్తవాడ జంక్షన్ వద్ద బాపూజీ విగ్రహానికి అదనపు కలెక్టర్ సంధ్యారాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీబీసీడీఓ పుష్పలత, అధికారులు, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్, నాయకులు ఎలగం సత్యనారాయణ, చిన్న కొమురయ్య, శామంతుల శ్రీనివాస్, బాసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ఎంపీ కడియం కావ్య

కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం స్ఫూర్తిదాయకం