ముందుబాబుల్లో రకాలు..
సరదాగా మొదలై.. బానిసగా మారుతున్న మహమ్మారి
మద్యం మహమ్మారికి బానిసవుతున్న యువత..
మద్యం
మత్తును
హన్మకొండ చౌరస్తా: స్నేహితుడికి కుమారుడు జన్మిస్తే దావత్.. పెళ్లి చేసుకుంటే దావత్.. సెలవు వస్తే దావత్.. చివరికి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఓదార్చేందుకు దావత్. ఇలా సందర్భం ఏదైనా మద్యంలో మునగాల్సిందే. ఫలితంగా దైనందిన జీవితంలో మత్తు భాగస్వామిగా మారిపోయింది. ఈ క్రమంలో మత్తుకు బానిసలైన వారికి చికిత్స అందించి పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు నగరంలో పలు రీహాబిలేషన్, డీఅడిక్షన్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఈ సెంటర్లలో ఎలాంటి చికిత్స అందిస్తారు..ఎన్ని రోజులు ఇస్తారు.. మద్యం తాగిన వ్యక్తిలో ఎలాంటి మార్పులు వస్తాయనే తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
మద్యానికి బానిసైన వారి లక్షణాలు..
ఆలోచనలు, భావోద్వేగాలు ఇవన్నీ నిరంతరం ఆ వ్యక్తిని తాగుడుకు ప్రేరేపిస్తుంటాయి. కుటుంబ ఆర్థిక స్థితి, వృత్తి, సామాజిక విలువలు, వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక చింతన పూర్తిగా నాశనమవుతున్నాయని తెలిసినా అతని శరీరం , మనసు తాగుడునే కోరుకుంటుంది. మద్యం లేకుండా ఉండలేడు.
కారణాలు ..
వారసత్వ ధోరణి, వ్యక్తిగత సమస్యలు, ఆల్కహాల్లోని ఇథనాల్, పొగాకులో ఉండే నికోటిన్ ప్రభావం, పరిసరాల ప్రభావంతో మద్యానికి బానిసలవుతారు.
చికిత్స విధానం..
మద్యం, డ్రగ్స్కు అడిక్ట్ అయిన వారి మానసిక, శారీరక ప్రవర్తనను బట్టి రెండు రకాల చికిత్స అందిస్తారు. అందులో మొదటిది డీఅడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించడం. రెండోది ప్రతీ పది రోజులకోసారి చికిత్స అందిస్తూ పర్యవేక్షించడం. రీహాబిలేషన్, డీఅడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసుకున్న వ్యక్తికి సమారు మూడు నెలల పాటు చికిత్స అందిస్తారు. క్లినిక్ సైక్రియాటిస్టు, సైకాలజిస్టు, కౌన్సిలర్లతో రోగికి కౌన్సెలింగ్ నిర్వహించి మానసిక పరివర్తన కలిగించేందుకు కృషి చేస్తారు. కుటుంబీకులను సైతం పిలిపించి వారికి కూడా కౌన్సెలింగ్ ఇస్తారు. మానసిక వైద్యంతో పాటు శారీరకంగా వచ్చిన వ్యాధులకు చికిత్స అందిస్తారు. రోజూ ఉదయం, సాయంత్రం డాక్టర్ పరీక్షించి సరైన మందులు ఇస్తారు.
సోషల్ డ్రింకర్: ఎప్పుడో ఒకసారి. పరిస్థితులకు అనుగుణంగా తాగుతాడు.
డెయిలీ డ్రింకర్ : ఈ వ్యక్తి రోజు పరిమితిగా తాగుతూ ఆహారం తీసుకుంటూ తన పని తాను చేసుకుంటాడు.
ఆల్కహాలిక్: ఈ వ్యక్తి సమయం, సందర్భం, ప్రదేశాలతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు అదుపు లేకుండా తాగుతాడు. తాగే ప్రతీ వ్యక్తి మద్యానికి బానిస కాడు. కేవలం 18 నుంచి 20 శాతం మంది మాత్రమే బానిసలవుతారు.
వ్యసన పరుల్లో అత్యధికులు యువతే
డీఅడిక్షన్ సెంటర్లో పెరుగుతున్న సంఖ్య
నేటి యువతకు మద్యం తాగడం సరదా అనిపిస్తోంది. అలా సరదాగా మొదలైన అలవాటు.. కొద్ది రోజుల్లోనే మద్యం మహమ్మారికి బానిసలవుతున్నారు. ఇటీవల మద్యానికి డ్రగ్స్ తోడైంది. ఓ వైపు మద్యం, మరో వైపు డ్రగ్స్ అనేక కుటుంబాలను వీధిన పడేస్తున్నాయి. మత్తులో నేరాలకు పాల్పడుతూ భవిష్యత్ను అంధకారం చేసుకున్న వారు ఎందరో ఉంటే.. మత్తుకు బలైపోతున్న వారు అనేక మంది ఉంటున్నారు. సమాజంలో చైతన్యం వస్తున్నా రోజురోజుకూ మద్యం, డ్రగ్స్కు బానిసలుగా మారుతున్న వారి సంఖ్య పెరుగుతుందే తప్పితే తగ్గడం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి.