నిట్‌లో రూ.650 కోట్లతో రీసెర్చ్‌ పార్క్‌ | - | Sakshi
Sakshi News home page

నిట్‌లో రూ.650 కోట్లతో రీసెర్చ్‌ పార్క్‌

Sep 20 2025 6:48 AM | Updated on Sep 20 2025 6:48 AM

నిట్‌

నిట్‌లో రూ.650 కోట్లతో రీసెర్చ్‌ పార్క్‌

గాటీ శక్తి విశ్వవిద్యాలయ వీసీ

మనోజ్‌చౌదరి

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌లో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు రూ.650 కోట్ల నిధులతో రీసెర్చ్‌పార్క్‌ను త్వరలో నిర్మించనున్నట్లు గుజరాత్‌లోని గాటీ శక్తి విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ మనోజ్‌చౌదరి తెలిపారు. నిట్‌ వరంగల్‌లోని అంబేడ్కర్‌ లర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రెండు రోజుల సెకండ్‌ రీసెర్చ్‌ స్కాలర్స్‌ పోస్టర్స్‌ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా మనోజ్‌చౌదరి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. సమాజానికి తోడ్పడే పరిశోధనలపై పీహెచ్‌డీ స్కాలర్లు దృష్టి సారించాలని, నూతన పరిశ్రమల స్థాపనకు రీసెర్చ్‌ పార్క్‌ తోడ్పడాలని అన్నారు. కార్యక్రమంలో నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుది, ప్రొఫెసర్‌ రవిశంకర్‌, వెంకయ్య చౌదరి, పీహెచ్‌డీ స్కాలర్లు పాల్గొన్నారు.

బతుకమ్మ, దసరాకు

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హన్మకొండ : బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనుంది. తెలంగాణలో అతి ముఖ్యమైన ఈ పండుగలకు వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు స్వగ్రామాలకు వస్తారు. ఈ క్రమంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వరంగల్‌ రీజియన్‌లో మొత్తం 1,284 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం డి.విజయభాను శుక్రవారం ప్రకటనలో తెలిపారు. హనుమకొండ నుంచి ఉప్పల్‌, పరకాల, భూపాలపల్లి, కాళేశ్వరం, నర్సంపేట, మహబూబాబాద్‌, తొర్రూర్‌, జనగామ నుంచి ఉప్పల్‌కు ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు వివరించారు. హనుమకొండ డిపో నుంచి 235, వరంగల్‌ –1 డిపో 228, వరంగల్‌ –2 డిపో 104, జనగామ 197, మహబూబాబాద్‌ 77, నర్సంపేట 166, పరకాల 138, తొర్రూరు 66, భూపాలపల్లి డిపో ద్వారా 72 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు వివరించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అప్పటికప్పుడు బస్సులను సమకూర్చి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.

సమస్యలుంటే నేరుగా

కలవండి

జూమ్‌ మీటింగ్‌లో టెమ్రిస్‌ సెక్రటరీ

న్యూశాయంపేట: సమస్య పరిష్కారానికి ఉద్యోగులు తనతో నేరుగా సంప్రదించాలని, ధర్నాలతో సమస్యలు పరిష్కారం కావని, సామరస్యంతో పరిష్కరించుకుంటే సత్ఫలితాలు ఉంటాయని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్‌) సెక్రటరీ బి.షఫియుల్లా అన్నారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని టెమ్రిస్‌ అధికారులు, ప్రిన్సిపాళ్లు, ఉద్యోగులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఆందోళనలు చేపట్టి టెమ్రిస్‌ ఇమేజ్‌ దెబ్బతీయోద్దని హితవు పలికారు. తాను తిరిగి సెక్రటరీ భాద్యతలు చేపట్టిన రెండునెలల కాలంలోనే 317 జీఓతోపాటు, టైం టేబుల్‌ మార్పు పలు సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. ఈ మీటింగ్‌లో ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్‌, విజిలెన్స్‌ అధికారులు, ప్రిన్సిపాళ్లు, తదితర అధికారులు పాల్గొన్నారు.

కాజీపేటలో చైన్‌ స్నాచింగ్‌

6 తులాల బంగారు ఆభరణాల

అపహరణ

కాజీపేట: కాజీపేట 47వ డివిజన్‌ బాపూజీనగర్‌ మాత కిరాణం గల్లీలో శుక్రవారం రాత్రి ఓ మహిళ మెడలోంచి గుర్తు తెలియని వ్యక్తి చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. బాధితురాలి కథనం ప్రకారం.. రిటైర్డ్‌ పోలీసు అధికారి సతీమణి రౌతు శిరీష తన ఇంటి పక్కన ఉండే బంధువుతో కలిసి రహదారిపై వాకింగ్‌ పూర్తి చేసుకుని ఇంటికెళ్తున్నారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై ముఖానికి మంకీ క్యాపు ధరించిన వ్యక్తి ఆకస్మికంగా దాడి చేసి మెడలోని బంగారు నగలను అపహరించాడు. సదరు మహిళ తేరుకుని కేకలు వేసే లోపే నిందితుడు పరారయ్యారు. దాదాపు 6 తులాల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తి అపహరించడంతో శిరీష కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. దీంతోపాటు మడికొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శ్రీమెట్టు రామలింగేశ్వర స్వామి కాలనీ రోడ్డు–1లో అదే సమయంలో మరో మహిళ మెడ నుంచి గొలుసు అపహరించడానికి ప్రయత్నించగా మహిళ ఎదురు తిరగడంతో నిందితుడు పారిపోయినట్లుగా చెబుతున్నారు. మడికొండ పోలీస్‌స్టేషన్‌ పోలీసులు విచారణ ప్రారంభించారు.

నిట్‌లో రూ.650 కోట్లతో రీసెర్చ్‌ పార్క్‌
1
1/1

నిట్‌లో రూ.650 కోట్లతో రీసెర్చ్‌ పార్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement