
ఎవరేమనుకుంటే మాకేంటి?
18 మందిపై వీధి కుక్కల దాడిపై స్పందన కరువు
వరంగల్ అర్బన్: ‘ఎవరేమనుకుంటే మాకేంటీ? ఎన్ని విమర్శలొస్తే ఏమవుతుంది. మా మాటే శాసనం, మేం చెప్పిందే వేదం. చేసిందే తీర్మానం. మేం తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాం’ అని నిరూపించుకున్నారు గ్రేటర్ వరంగల్ పాలకులు. మరో ఏడు నెలలు గడిస్తే పదవీ కాలం పూర్తవుతున్న తరుణంలో అధ్యయనం పేరిట విహారయాత్ర చేస్తున్నారంటూ జనాగ్రహం వెల్లువెత్తినా.. డోంట్ కేర్ అన్నట్లుగా ముందుకుసాగారు. ఆదివారం రెండు బృందాలుగా బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రైవేట్ బస్సుల్లో బయల్దేరారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్, రాజస్థాన్లోని జైపూర్ నగరంలో శాసీ్త్రయ పద్ధతులు, సుందీరకణ తదితర అవసరాల కోసం వెళ్లారు. ఈ యాత్ర ఈనెల 19 వరకు యాత్ర కొనసాగనుంది. మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వాన్ షమీమ్, 66 మంది కార్పొరేటర్లు ఉండగా.. అందులో 55 మంది టూర్కు ఓకే చెప్పారు. 25 మంది అధికారులు, ఉద్యోగులు యాత్రకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ, చివరి క్షణంలో ఐదుగురు కార్పొరేటర్లు వెళ్లలేదు. కొందరు మహిళా కార్పొరేటర్ల భర్తలు, తనయులను కూడా వెంటబెట్టుకుని వెళ్లారు. వీరి సొమ్మును బల్దియా పాలక వర్గం పెద్దలు భరిస్తున్నట్లు లెక్క రాస్తున్నారు. బల్దియాకు చెందిన కొంత మంది ఇంజినీర్లు, సూపరింటెండెంట్లు, సిబ్బంది ఈ యాత్రకు ఎంపిక చేయడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఆదివారం నగరం నుంచి నుంచి బస్సుల్లో బయల్దేరి వెళ్లగా.. హైదరాబాద్ శంషాబాద్లో విమానమెక్కి, ఇండోర్ నగరంలో దిగనున్నారు. మేయర్ తన హోదాకు తగ్గట్టుగానే బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్నారు. కార్పొరేటర్లు ఎకానమీ క్లాస్లో ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. మేయర్ గుండు సుధారాణి ఇండోర్ నుంచి ఈనెల 16న సాయంత్రం వరంగల్ నగరానికి తిరిగి రానున్నారు. 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బల్దియా ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అదే రోజు మలివిడతగా రాజస్థాన్లోని జైపూర్ నగరానికి వెళ్లి అక్కడ స్టడీటూర్లో భాగస్వామ్యం కానున్నారు. పాలక వర్గం పెద్దల బిజినెస్ క్లాస్ విమానయానం ప్రయాణ ఖర్చులు బల్దియాకు అధికభారమనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ టూర్ కోసం రూ.50 లక్షల స్మార్ట్సిటీ నిధులను వెచ్చిస్తున్నారు.
వరంగల్ చింతల్లో కుక్కల కాటుతో ఆదివారం ఉదయం 18 మందికి గాయాలైనప్పటికీ పాలక వర్గం, పెద్దలు, స్థానిక కార్పొరేటర్, ప్రజారోగ్యం అధికారులు ప్రజలు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సొమ్ముతో స్టడీ టూర్ వెళ్లడమా? సమస్యలు పరిష్కరించకుండా కట్టకట్టుకుని నిబంధనలను విస్మరిస్తూ ప్రయాణించడంపై పెదవి విరుస్తున్నారు. కాగా.. దేశంలోని ఇండోర్, జైపూర్ నగరాలు సమగ్ర శానిటేషన్, ఆధునిక పద్ధతులతో అత్యున్నత స్థానాలను దక్కించుకుంటున్నాయని, స్టడీ టూర్ కోసం బల్దియా పాలక వర్గం, అధికారుల బృందం వెళ్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో బృందాలు వెళ్తున్న బస్సులను ఎమ్మెల్యే నాయిని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో పాలక వర్గం పెద్దలు, కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు తదితరులు ఉన్నారు.
స్టడీ టూర్కు 2 బృందాలు
మేయర్, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది ప్రయాణం